నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. కల్కాజీ ఎక్స్టెన్షన్లో భూమిహీన్ క్యాంప్ ఎదుట బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేత చర్యలను పార్టీశ్రేణులతో కలిసి ఆప్ మాజీ సీఎం అతిషి అడ్డుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆప్ నాయకులను వ్యాన్ ఎక్కించి స్థానిక పీఎస్ కు తరలించారు. మురికివాడల ప్రజల పట్ల బీజేపీ, రేఖా గుప్తా ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని, వారి తరుపు పోరాడుతున్న తనను బీజేపీ జైలులో వేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పందన్నారు. ప్రజలపైకి బుల్డోజర్ల నడిపించి..ప్రజల ఆస్తులను, జీవనోపాధిని ధ్వంసం చేస్తున్నారని ఆపార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.
దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ఎక్స్టెన్షన్లోని వెలిసిన అక్రమ కట్టడాలను తొలగించాలని సోమవారం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) నోటీసులు జారీ చేసింది. జూన్ 8, 9 10 తేదీలలోపు నివాసితులు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని కోరారు. అయితే బాధితులకు ఎలాంటి గడువు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం బాధితులపై బుల్డోజర్లతో వారి ఆస్తులను, ఇండ్లను, దుకాణాలను కూల్చివేయడం సరైన పద్ధతి కాదని ఆప్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.