Saturday, June 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపనిచేస్తేనే పదవులు

పనిచేస్తేనే పదవులు

- Advertisement -

– డీసీసీ అధ్యక్షులు, సంస్థాగత నిర్మాణం పరిశీలకుల సమావేశంలో మీనాక్షి నటరాజన్‌ దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మేడం మీనాక్షి నటరాజన్‌. రాష్ట్రానికి కాంగ్రెస్‌ వ్యవహారాలు చూసేందుకు వచ్చిన ఏఐసీసీ ఇన్‌చార్జి. గతంలో వచ్చిన ఇన్‌చార్జీలకు భిన్నంగా ఆమె ప్రతిసారి తనదైన ముద్రను చూపిస్తూనే ఉన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై మొదట్నుంచీ దృష్టి సారించారు. పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. పని చేయకుండా పదవుల కోసం ఆరాటపడే వారికి చెక్‌ పెడుతూ, పని చేసే నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే దిశగా మీనాక్షి నటరాజన్‌ ముందుకెళ్తున్నట్టు పార్టీ శ్రేణులకు ప్రతి సందర్భంలో సంకేతాలను పంపిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేసే దిశగా పురిగొల్పుతున్నారు. అదే సమయంలో కేవలం పదవులను పట్టుకుని వేలాడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంట్లో కూర్చుని పదవుల కోసమే తామున్నామన్నట్టు వ్యవహరించే వారి ఆశలు నెరవేరవని హెచ్చరిస్తూనే ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌ నుంచి డీసీసీ అధ్యక్షులతో, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో నిర్వహించిన జూమ్‌ సమావేశంలోనూ మీనాక్షి నటరాజన్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో పని చేసే వారికి పదవులు వరిస్తాయనీ, అందులోనూ సామాజిక న్యాయం అమలవుతుందని స్పష్టం చేశారు. పని చేయకుండా పదవులు కోరుకునే వారికి ఆశాభంగం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో మండల, జిల్లా కమిటీల నియామకంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌లో పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. సామాజిక న్యాయాన్ని కాపాడుతూ పార్టీలో, ప్రభుత్వంలో పదవుల పంపిణీ చేస్తున్నదని తేల్చిచెప్పారు. పదవులను పంపిణీ చేసిన విధానాన్ని వివరించారు. సమాజంలో ఎవరి వాటా వారికి ఇవ్వాలన్న సిద్ధాంతంతో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పని చేస్తున్నారని తెలిపారు. ఆయన సిద్ధాంతాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆ సిద్ధాంతాల అమల్లో భాగంగా ఇప్పటి వరకు ఇచ్చిన పదవులన్నింటిలో సామాజిక న్యాయాన్ని పాటించినట్టు స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్నారు. పార్టీలో పని చేసిన వారందరికీ పదవులొస్తాయని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. చిత్తశుద్ధితో పని చేసిన వారందర్నీ పార్టీ వారి వారి స్థాయిలలో తప్పకుండా గుర్తిస్తుందని తెలిపారు. జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమాలను తెలంగాణలో పెద్దఎత్తున అన్ని రాష్ట్రాల కంటే బాగా చేశామని ఆయన గుర్తుచేశారు. ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు చెప్పడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. సంస్థాగత నిర్మాణం కూడా తెలంగాణలోనే బాగా జరుగుతున్నదనీ, రాష్ట్ర పరిశీలకులు, కో ఆర్డినేటర్లు బాగా పని చేస్తున్నారని తెలిపారు. మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -