– తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రమేష్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం కార్మికులకు చేస్తున్న ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్న దేశాయి బ్రదర్స్ దోపిడీనీ అరికట్టాలనీ, దేశాయి బ్రదర్స్ బీడీకార్మికులతో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కార్మిక శ్రమ దోపిడీ చేస్తూ, ఒక్క కార్మికురాలు వద్ద ఒక 1000 బీడీలకు పది రూపాయల చొప్పున సుమారుగా 70 వేల మంది కార్మికుల పొట్ట కొడుతూ కోట్ల డబ్బులను దేశాయి కంపెనీ యాజమాన్యం దండుకుంటున్నారన్నారు.
చట్ట వ్యతిరేకంగా కనీస వేతనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ, కనీస వేతనాల ఒప్పందని కాలరాస్తూ బీడీ కార్మికులను దోచుకోవడం సిగ్గుచేటన్నారు. లేబర్ అధికారుల ముందు వేతనాల ఒప్పందం అమలుపై సంతకం చేసి, దొడ్డిదారిన టేకేదారులను మధ్యవర్తులుగా పెట్టుకొని, పది రూపాయలు చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. టేకదారు కార్మికుల పక్షాన నిలబడాల్సింది పోయి యజమానియానికే వత్తాసు పలకడం పనికిమాలిన తనమన్నారు. ఇది తగదన్నట్లు పిటారా పేరుతో నాసిరకం తినుబండారాలను, ఎలాంటి లైసెన్సులు లేకుండా దొడ్డిదారిన కార్మికులకు అంటగడతు అటు ప్రభుత్వాన్ని ఇటు కార్మికులను మోసం చేస్తున్నారన్నారు.
అనుమతి లేకుండా కార్మికులకు బలవంతన అంటగడుతున్నారన్నారు. వేయి భీడీలకు సరిపోయే నాణ్యమైన ఆకు, దారము, తంబాకు ఇవ్వకుండా కార్మికులను నిండా ఉంచుతున్నారన్నారు. దేశాయి బ్రదర్స్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు, పలువురు బీడీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.



