రంపచోడవరం: మారేడుమిల్లి ఏజెన్సీలో మంగళ, బుధవారాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు రంపచోడవరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. శుక్రవారం జ్యోతి, మల్ల అలియాస్ మల్లాలు, లోకేష్ అలియాస్ గణేష్ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో, ఇప్పటి వరకూ ఏడుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్టయింది. ఇంకా ఆరుగురి మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుండటంతో మృతుల కుటుంబీకులకు పడిగాపులు తప్పడం లేదు. ఎన్కౌంటర్లు జరిగి రోజులు గడుస్తున్నా నేటికీ మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించకుండా జాప్యం ప్రదర్శిస్తున్నారని, మృతదేహాలు పాడైతే తమ వారిని కడచూపు చూసేందుకూ వీలుండదని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ ప్రాంతాల నుంచి వచ్చామని, అక్కడకు వెళ్లాలంటే సుమారు 10 నుండి 15 గంటల సమయం పడుతుందని, ఈ దృష్ట్యా పోస్టుమార్టం త్వరగా చేయాలని కోరుతున్నారు. శుక్రవారమూ రంపచోడవరం ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.



