ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. సర్పంచులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి దాకా ఉపసర్పంచ్ కు జాయింట్ చెక్పవర్పై ఉంటుందా..లేదా అనే విషయంలో సందిగ్ధం ఉండేది. గత పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో నూతన పాలకవర్గం ఏర్పడేదాకా పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారికి జాయింట్ చెక్ పవర్ ఉండేది.
ఆయా పంచాయతీల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు, ఇతర ఖర్చులకు నిధులు డ్రా చేయాలంటే వీరిద్దరి సంతకాలు అవసరముండేది. ఇటీవల కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరడంతో రాష్ట్ర ప్రభుత్వం పాత ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాయింట్ చెక్ పవర్ కల్పించేందుకు ఇటీవల సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలు, వేలిముద్రలు, పాన్కార్డు, పోన్ నంబర్ తదితర వివరాలు సేకరించిన ఆధికారులు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి అందజేశారు.
నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లోకే..
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాల్లోకి నేరుగా నిధులు విడుదల చేస్తోంది. ప్రతీ మూడు లేదా ఆరు మాసాలకోసారి నిధులు విడుదలవుతాయి. ఈ ఆర్థిక లావాదేవీల నిర్వహణకు కేంద్ర పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్(పీఎఫ్ఎంఎస్) అనే ఆన్లైన్ పోర్టల్ను తీసుకువచ్చింది. సర్పంచ్, ఉపసర్పంచ్ వేలిముద్రల ఆధారంగా డిజిటల్ కీ తయారు చేస్తారు.వాటిని ఉపయోగించి పనులు చేసిన వారి బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు నేరుగా బదిలీ చేసే అధికారముంది.గతంలో డిజిటల్ కీ తయారు బాధ్యతల ను ఏజెన్సీకి అప్పగించగా డబ్బులు చెల్లించి దానిని తయారు చేసుకున్నారు.ప్రస్తుతం బాధ్యతలను ఏజెన్సీకి అప్పగిస్తారా? లేదా.. డీపీఎం, ఈ పం చాయతీ ఆపరేటర్ల ద్వారా చేస్తారా? అనే విషయం పై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
మండలంలో 15 గ్రామపంచాయతీలుండగా 15 మంది సర్పంచులున్నారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నెలనెలా నిధులు విడుదల చేయాలి. వీటిని డ్రా చేయడానికి ఐఎఫ్ఎంఎస్ అమలులో ఉంది. నిధులు డ్రా చేయడానికి డిజిటల్ కీ లేకపోయినా సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలు ఆన్లైన్ చేయాలి.వారి డిజిటల్ సంతకాలు బ్యాంక్, ట్రెజరీ అధికారులకు పంపాలి. పంచాయతీ కార్యదర్శి చెక్ రాసి సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో ట్రెజరీకి పంపించాలి. డిజిటల్ సంతకాలు సక్రమంగా ఉంటేనే సంబంధిత బిల్లు పాస్ అవుతుంది.



