నవతెలంగాణ-హైదరాబాద్: నోట్ల కట్టల వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై సోమవారం ప్రవేశపెట్టిన అభిశంసను లోక్సభ స్వీకరించింది. ఈ అభియోగాలపై ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు. ముగ్గురు సభ్యుల కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణింద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ జడ్జి బి.వి. ఆచార్యలు ఉన్నారు.
జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలంటూ బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపిల ప్రతినిధి బృందం మెమోరాండం సమర్పించినట్లు లోక్సభ స్పీకర్ తెలిపారు. ట్రెజరీ, ప్రతిపక్ష సభ్యులు మొత్తం 146 మంది ఎంపిలు దానిపై సంతకం చేశారని లోక్సభ స్పీకర్ పేర్కొన్నారు.
సాధారణంగా జడ్జి తొలగింపు తీర్మానంపై లోక్సభలో సుమారు 100మంది సభ్యులు మరియు రాజ్యసభలో 50 మంది సంతకం చేయాల్సి వుంది. ఈ తీర్మానాన్ని చైర్మన్ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. స్పీకర్ నియమించిన కమిటీ సాక్షులను మరోసారి ప్రశ్నించే అధికారం ఉంది. ఈ నివేదికను మొదట స్పీకర్కు సమర్పిస్తారు. తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద ఎత్తున నోట్లకట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక కమిటీని నియమించారు.