కాకినాడ : జెవివి కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షురాలు, విద్యావేత్త, ఐడియల్ కళాశాలల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవిని కుమారి (94) ఆదివారం ప్రతాప్ నగర్లోని తన స్వగృహంలో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్య, సాహిత్య రంగాల్లో చిరంజీవిని కుమారి విశిష్ట కృషి చేశారు. తెలుగు భాష, స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేశారు. కాకినాడలో ఐడియల్ కళాశాల ద్వారా చాలామంది ఉన్నత స్థానానికి వెళ్లారు. జీవితాంతం ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారు. సమాజ సేవకు అంకితమయ్యారు. వామపక్ష భావజాలంతో మెలిగారు. తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా జిల్లాలో తెలుగు భాష అభివృద్ధికి విశేష కృషి చేశారు. జెవివి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తొలి అధ్యక్షరాలిగా బాధ్యతలు నిర్వహించారు. జెవివి నిర్వహించిన సామాజిక విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలోనూ, అక్షర గోదావరి ఉద్యమంలోనూ ముఖ్యపాత్ర పోషించారు. ‘భారత స్వాతంత్య్ర సమరాంగణంలో గోదావరి తీరం’ అనే గ్రంథాన్ని పునర్ముద్రణ చేయడమే కాకుండా అనేక పుస్తకాలు తీసుకొచ్చి ఎనలేని సాహిత్య సేవ చేశారు. ఆమె భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. సోమవారం కాకినాడలో అంత్యక్రియులు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
సీపీఐ(ఎం) సంతాపం
చిరంజీవినికుమారి మృతి పట్ల సీపీఐ(ఎం) కాకినాడ జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవిని కుమారి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. విద్య, సాహిత్య రంగాలలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, మహిళా సమస్యలపై సదస్సులు, చర్చా వేదికల్లో ప్రజలను జాగృతం చేసేలా ఆమె కృషి చేశారని కొనియాడారు. మొదటి నుంచి వామపక్ష భావజాలంతో మెలిగారని, జనవిజ్ఞాన వేదిక వంటి సైన్స్ రంగంలో బాధ్యతలు తీసుకుని పని చేశారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకరవర్మ, నాయకులు చక్రవర్తి, ఐ.ప్రసాదరావు, నగేష్, సూరిబాబు సంతాపం తెలిపారు. చిరంజీవిని కుమారి మృతికి జెవివి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గేయానంద్, కుర్రా రామారావు సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమకారిణిగా ఆమె చేసిన కృషి సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
అభ్యుదయవాదిచిరంజీవిని కుమారి మృతి
- Advertisement -
- Advertisement -