– క్యాబినెట్ సబ్కమిటీ కాలయాపన సరికదు
– కనీస వేతనాల సలహామండలి సిఫారసులు అమలు చేయాలి
– వేతనాల పెంపులో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి
– 2021లో విడుదల చేసిన ఐదు ప్రిలిమినరీ జీవోలను గెజిట్ చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కనీస వేతనాల సవరిస్తూ 2021లో విడుదల చేసిన ఐదు ప్రిలిమినరీ జీఓలను యదాతథంగా గెజిట్ చేయాలనీ, కనీస వేతనాలపై వేసిన సబ్కమిటీ కాలయాపనకు స్వస్తి చెప్పాలని, వేతనాల పెంపులో సుప్రీం కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. కనీస వేతనాల జీవోల విడుదల కోసం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పిలుపును జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మిగిలిన 68 షెడ్యూల్డ్ పరిశ్రమల జీఓలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కనీస వేతనాల సవరణకు సుప్రీం కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని, కనీస వేతనాల సలహా మండలి ప్రతిపాదనలు పక్కనపెట్టి కేబినెట్ సబ్ కమిటీ చేస్తున్న కాలయాపనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమేర్పడిన పదేండ్లలో నాలుగు కనీస వేతన సలహా మండళ్లు చేసిన సూచనలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేయడాన్ని తప్పుబట్టారు. 2016 నుంచి 2021 వరకు సాగిన కనీస వేతనాల సలహా మండలి సూచనలతో 2021లో ఐదు షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలను జారీ చేసిందనీ, ఆ తర్వాత యాజమాన్యాల ఒత్తిడితో గెజిట్ చేయకుండా పెండింగ్లో పెట్టిందని విమర్శించారు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు జారీ చేసిన జీవోలను గెజిట్ చేయకపోవడం వల్ల ప్రతి నెలా రూ.6 వేల కోట్లు నష్టపోతున్నారని వాపోయారు. ఇలా కార్మికుల శ్రమ దోపిడీని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలకడం అన్యాయ మని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక చర్యను విడనాడి కనీస వేతనాల సలహా మండలి సిఫారసుల ప్రకారం 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికుల కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనాల కోసం నేడు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES