పారదర్శకతే ప్రాణం
పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పనిసరి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పాలనా వ్యవస్థకు వెన్నెముకలాంటివని, పారదర్శకతే పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రాణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం రామోజీఫిల్మ్ సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్లు, కమిషన్ సభ్యులు, నిపుణులు, అధికారుల రెండ్రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. శనివారం జరిగిన ముగింపు సమావేశానికి డిప్యూటీ సీఎం హాజరై ప్రసంగించారు. పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పనిసరి అని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తోందని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల న్యాయమైన, పారదర్శకమైన, సమగ్ర నియామక విధానాల ద్వారానే ప్రజా సేవలో ప్రతిభకు సరైన స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు.
పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పని సరిగా ఉండాలన్నారు. పరీక్షల్లో జాప్యం వల్ల యువతలో నిరాశ పెరుగుతోందని, అభ్యర్థుల భవిష్యత్ను దష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికతో పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్లపై ఉందన్నారు. వార్షిక క్యాలెండర్ అమలు చేయడం ద్వారా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి తుది ఎంపిక వరకు ప్రతి దశ స్పష్టంగా, సందేహాలకు తావులేకుండా ఉండాలని భట్టి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి రియల్టైమ్ సమా చారం అందించాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందడమే కమిషన్ల ప్రధాన లక్ష్యమన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్లు ప్రజాసేవ విలువలకు విరుద్ధమని, ఇవి అభ్యర్థుల కలలను చిదిమేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
లీకేజీలను అడ్డుకునేందుకు ఆధునిక సాంకేతిక భద్రతా వ్యవస్థలు అమలు చేయాలని, సిబ్బందికి నైతిక విలువల పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. తప్పిదాలు చోటుచే సుకుంటే వేగంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకో వాలన్నారు. ఇంటర్వ్యూలు కేవలం జ్ఞాన పరీక్షలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వం, నైతికత, నిర్ణయ సామ ర్థ్యాన్ని అంచనా వేసేలా ఉండాలని సూచించారు. విభిన్న నేపథ్యాల నిపుణులతో ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో కమిషన్ల పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం చెప్పారు. రిజర్వేషన్లు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా వాస్తవికంగా ఫలితాలు ఇచ్చేలా చూడాలన్నారు. అర్హులైన అభ్యర్థులు అవకాశాలు పొందేలా కోచింగ్, సడలింపులు, పర్యవేక్షణ వ్యవస్థలు ఉండాలన్నారు.
నియామక ప్రక్రియల్లో న్యాయ పరమైన వివాదాలు తగ్గిం చాల్సిన అవసరం ఉంద న్నారు. స్పష్టమైన నిబంధనలు, ముందస్తు సమా చారం ఇవ్వడం ద్వారా లిటిగేషన్ను తగ్గించొచ్చని చెప్పారు. కోర్టుల తీర్పుల నుంచి పాఠాలు నేర్చుకొని వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలని, రాజకీయ ప్రభావాలకు లోను కాకుండా పనిచేయాలన్నారు. స్వతంత్రతను సద్విని యోగించుకుని సంస్కర ణలకు నాయకత్వం వహిం చాలని సూచించారు. ఈ సదస్సు చర్చలకు, కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవ్వాలని కోరారు. విశ్వాసాన్ని పునర్నిర్మించి, ప్రతిభకు సమానత్వంతో అవకాశం కల్పిస్తూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లను నిజాయితీకి ప్రతీకగా నిలపాలని అన్నారు.



