సద్వినియోగం చేసుకోవడం లబ్ధిదారులు వంతు..
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అసలైన పేదలు ఎవరైతే ఉన్నారో వారినే లబ్ధిదారులు గా ఎంపిక చేయడం వారిని సమగ్రంగా అభివృద్ది చేయడంలో ప్రజాక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆద్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు.
ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో భాగంగా నియోజక వర్గం కేంద్రం,అశ్వారావుపేట మున్సిపాల్టీ లోని రైతు వేదిక లో గత ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆకాంక్ష మేళ జిల్లాస్థాయి కార్యక్రమంలో భాగంగా శనివారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప నుండి ముల్లు వేరు చేయుట,చేప వ్యర్ధాలు నుండి చేపల ఎరువులు తయారీ, చేప రసం తయారీ, సర్క్యూలేటేడ్ అక్వాకల్చర్ సిస్టమ్ పై పలువురు ఔత్సాహిక గిరిజన రైతులకు అవగాహన కల్పించారు.
మత్స్య శాఖ జేఏ ఎం.పావని పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.చేపల పెంపకం పై ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వం అందించే రాయితీలు ప్రభుత్వ ప్రోత్సాహకాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ క్షేత్ర అధికారి మిడియం మంగ రాజు,ఉదయ్ ఆక్వా కల్చర్ రీజినల్ మేనేజర్ పీహెచ్.రవికుమార్, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు,నాయకులు జూపల్లి రమేష్,సుంకవల్లి వీరభద్ర రావు,మత్స్య రైతులు తదితరులు పాల్గొన్నారు.