నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ధాన్యం నిల్వ వ్యవస్థ పక్కాగా నిర్వహించి, ధాన్యం ఎల్లప్పుడూ మంచి నాణ్యతతో ఉండేలా పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇటిక్యాల మండలంలోని స్టేట్ వేరోస్ కార్పొరేషన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలోని బఫర్ గోదామును జిల్లా కలెక్టర్ అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం గోదామును పరిశీలించి, ధాన్యం నిల్వ వ్యవస్థ పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. గోదాంలో నిల్వ ధాన్యం నాణ్యతను క్వాలిటీ మిషన్ ద్వారా జాగ్రత్తగా పరిశీలించి, నాణ్యత కలిగిన ధాన్యాన్ని మాత్రమే నిల్వ చేయాలన్నారు.మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉపయోగించి ధాన్యంలో రంగు మార్పు ఉన్నవి గుర్తించి, వాటిని నిల్వ చేయకూడదని తెలిపారు.
తేమశాతంను తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. ఓపిఎంఎస్(ఆన్లైన్ ప్యాడీ మానేజ్మెంట్ సిస్టం ) లో ఎప్పటికపుడు అప్డేట్ చేయాలన్నారు.గోదాం నిల్వ విధానం కూడా అన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. జిల్లాలో దాదాపు 40 వేల టన్నుల ధాన్యం గోదాములో నిలువలుగా ఉన్నందున, ఇతర జిల్లాలకు తరలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హమాలీలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, టెక్నికల్ ఆఫీసర్ సుబ్బన్న, గోదాము మేనేజర్ నాగరాజు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.