పింఛన్లు, అంగన్వాడీల, ఆశ వర్కర్ల వేతనం పెంపు
ఉద్యోగులకు డీఏ..మహిళలు, యువతకు నెలకు రూ.1000
తిరువనంతపురం : బుధవారం దక్షిణభారతదేశంలో తుపాను కారణంగా విస్తారంగా వర్షాలు కురియగా, కేరళలో మాత్రం వరాల వర్షం కురిసింది. సామాజిక పింఛన్లతోపాటు ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ కార్మికులకు వేతనాలు పెంచుతూ విజయన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సామాజిక సంక్షేమాన్ని పెంపొందిం చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి విజయన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. దీని ప్రకారం సామాజిక పింఛన్లను రూ. 1600 నుంచి రూ 2 వేలకు పెంచారు. దీని కోసం ప్రభుత్వం రూ. 13 వేల కోట్లను కేటాయించింది. అలాగే, ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ 1000 పెంచారు. అలాగే మహిళలకు, యువతకు నెలకు రూ 1000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
ఇప్పటి వరకూ ఏ పెన్షన్కు లబ్ధిదారులు కాని, వెనుకబడిన కుటుంబాలకు చెందిన 35 నుంచి 60 ఏండ్ల మహిళలకు నెలకు రూ 1000 ఆర్థిక సాయం చేయనున్నారు. రేషన్కార్డును దీనికి అర్హతగా నిర్ణయించారు. అదేవిధంగా కుటుంబ ఆదాయం రూ 1 లక్ష కంటే తక్కువగా ఉన్న యువతకు నెలకు రూ. 1000 అందిచనున్నారు. ఇంటర్ లేదా ఐటిఐ, డిప్లోమో, డిగ్రి కోర్సుల పూర్తి చేసిన వారు, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేస్తున్నవారు, పోటీ పరీక్షలకు సిద్ధ పడుతున్న అభ్యర్థులకు కూడా ఈ సాయం అందిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయలు, పెన్షనర్లకు నవంబర్ నుంచి 4 శాతం డీఏను పెంచారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు గౌరవ వేతనాన్ని రూ 1000 పెంచారు. గెస్ట్ లెక్చరర్లకు నెలకు గరిష్టంగా 2 వేలు రూపాయిల మేరకు జీతం పెరుగుతోంది. 13,327 మంది ఆహార సేవా కార్మికుల రోజువారీ వేతనాన్ని రూ 50 పెంచారు. రబ్బరు మద్దతు ధరను కిలోకు రూ 180 నుంచి రూ 200కు పెంచారు.



