నవతెలంగాణ ముంబయి: ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించింది ఆర్బీఐ.. మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి పడిపోవడం, వృద్ధి రేటు పెరగడంతో రేట్ల కోత చేపట్టినట్లు మల్హోత్రా వెల్లడించారు.
వడ్డీ రేట్లను తగ్గించడంతో గృహ, వాహన రుణ గ్రహీతలకు మరికొంత ఉపశమనం లభించినట్లయ్యింది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ.. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు 1.25 శాతం వరకు దిగొచ్చింది.
కీలక అంశాలు
- జీఎస్టీ హేతుబద్ధీకరణతో కొనుగోళ్లు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2శాతం వృద్ధి నమోదైంది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచుతున్నాం.
- ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టింది. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను 2.6శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నాం.
- రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్ల విక్రయాల కోసం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ను నిర్వహించాలని నిర్ణయించాం.
- విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రాబోయే 11 నెలల వరకు దిగుమతులకు ఇవి ఉపయోగపడతాయి.



