కానీ..ఇజ్రాయిల్ షరతులు అంగీకరిస్తేనే :హమాస్
- తాజా దాడుల్లో 45 మంది పాలస్తీనియన్లు మృతి
గాజా: గాజాలో ఇజ్రాయిల్ మారణహౌమం అస్సలు ఆపటంలేదు. హమాస్ చర్చలకు వచ్చినా..క్షిపణి దాడులు ఆపబోమని నెతన్యాహు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు యుద్ధ విరమణకు సిద్ధంగా ఉన్నామని, తమ షరతులను ఇజ్రాయిల్ అంగీకరించాల్సి ఉంటుందని హమాస్ స్పష్టం చేసింది. గాజా నిర్వహణకు స్వతంత్ర జాతీయ పరిపాలన ఏర్పాటు చేయాలని సూచించింది. ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయటానికి సమ్మతి హమాస్ తెలిపింది. మరోవైపు దుందుడుకు గాజా నగరాన్ని ముట్టడించేలా ఇజ్రాయిల్ దురాక్రమణకు దిగుతోంది.ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మొత్తాన్ని దాదాపుగా అన్నింటినీ స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ కోసం ఒక ప్రణాళికను తయారుచేశారు.
2023 అక్టోబర్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజా చిన్నా,పెద్దా, మహిళలనే తేడాలేకుండా అమాయకులు 63,746 మంది మరణించారు . 161,245 మంది గాయపడ్డారు. అక్టోబర్ 7 దాడుల సమయంలో ఇజ్రాయిల్లో మొత్తం 1,139 మంది మరణించారు. దాదాపు 200 మంది బందీలుగా ఉన్నారు.
గాజా నగరంలోని నివాస ప్రాంతాలు, తాత్కాలిక శిబిరాలపై ఇజ్రాయిల్ బాంబు దాడులను తీవ్రతరం చేస్తోంది.దీంతో చాలా కుటుంబాలు ”తుడిచిపెట్టబడుతున్నాయి”. గురువారం తెల్లవారుజాము నుంచి జరిపిన క్షిపణి దాడుల్లో కనీసం 45 మంది పాలస్తీనియన్లు మరణించారు.
ఇజ్రాయిల్ దుశ్చర్యకు యూకేలో నిరసన
పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ సాగిస్తున్న నరమేధానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా యూకేలోని కాస్మోటిక్స్ విక్రయించే షాపులు గురువారం మూసివేశాయి. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని కోరుతూ ఓకరోజు సౌందర్య సాధనాల విక్రయాలను నిలిపివేశారు. గాజాలోని పాలస్తీనియన్లకు సంఘీభావంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రిటిష్ కాస్మోటిక్ షాపు నిర్వాహకులు తెలిపారు.