నవతెలంగాణ – భీంగల్: భీంగల్ మండలం జాగిర్యాల్, బాబాపూర్ గ్రామలలో తహసీల్దార్ షబ్బీర్, డిప్యూటీ అధికారి శ్రీనివాస్, ఆర్ ఐ సాయ గౌడ్ ఆధ్వర్యంలో భూ భారతి అవగాహన సదస్సు, దరఖాస్తుల స్వీకరణ నిర్వహించారు. గతంలో రైతులు ఎదుర్కొన్న భూసంబంధిత ఇబ్బందులను నివారించేందుకే ఈ నూతన చట్టం అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో భూ భారతితో సంబంధిత అవగాహన సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రైతుల భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి – ఆర్వోఆర్ (ROR) చట్టం ద్వారా రైతులకు అనేక లాభాలు కలుగుతాయని అన్నారు. రైతులు తమ భూ సమస్యలను భూ భారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించనున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించి, రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
మండలాల వారిగా రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ను సైతం ప్రకటించి ఏ రోజున ఏ గ్రామంలో సదస్సు జరుగుతుందనేది ప్రజలకు తెలిసేలా ముందు సమాచార ప్రచారం చేస్తున్నారు. మండలానికి రెండు టీమ్లను ఏర్పాటు చేసి భూ సమస్యలపై దరఖాస్తులను తీసుకుంటున్నామని భీంగల్ మండల తాసిల్దార్ షబ్బీర్ తెలిపారు. ఈ నెల 20 వరకు సదస్సులు కొనసాగనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది,ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.