– అక్టోబర్లో ఐదేండ్ల గరిష్టానికి చేరిక
– రోజుకు 5.68 లక్షల బ్యారెళ్లు
– ట్రంప్ షరతులకు తలొగ్గిన మోడీ
న్యూఢిల్లీ : అమెరికా నుంచి చమురు దిగుమతులు నూతన రికార్డ్లను చేరాయి. ఇటీవల యూఎస్ అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ఆంక్షలకు ప్రధాని నరేంద్ర మోడీ తలొగ్గి ఆ దేశం నుంచి భారీగా చమురు కొనుగోళ్లను పెంచారు. చౌకగా లభించే రష్యా చమురును తగ్గించడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్ అమెరికా నుంచి భారత్కు గత ఐదేండ్లలో ఎప్పడూ లేని స్థాయి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. డేటా అనలిటిక్స్ సంస్థ కెప్లర్ నివేదిక ప్రకారం.. అక్టోబర్లో యూఎస్ నుంచి భారత్ రోజుకు సగటున 5,68,000 బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంది. 2021 మార్చి తర్వాత ఈ స్థాయిలో దిగుమతులు జరగడం ఇదే మొదటిసారి. సెప్టెంబరులో దిగుమతులైన 2,07,000 బ్యారెల్స్తో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ కావడం ఆందోళనకరం. ఇది ట్రంప్ ఆంక్షలకు భారత్ తలొగ్గిందనడానికి నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు.భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో యూఎస్ వాటా 12 శాతానికి పెరిగింది. ఇంతక్రితం సెప్టెంబర్లో ఇది 4.5 శాతంగా ఉంది. అమెరికా నుంచి దిగుమతులు పెరిగినప్పటికీ.. రష్యా ఇప్పటికీ భారతదేశానికి అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. అక్టోబర్లో భారత్ దిగుమతుల్లో రష్యా వాటా 34 శాతంగా ఉండటం విశేషం. రష్యా నుంచి రోజుకు 16.2 లక్షల బ్యారెల్స చమురు దిగుమతి అయ్యింది. ఇరాక్, సౌదీ అరేబియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ట్రంప్ ఆదేశాల మేరకు రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. అమెరికాకు సహకరిస్తామన్న ప్రధాని మోడీ హామీ మేరకు భారత రిఫైనరీలు అమెరికా కంపెనీల నుంచి చమురు బుకింగ్ పెంచుకున్నట్టు వాణిజ్య, ప్రభుత్వ వర్గాల సమాచారం.
అమెరికా నుంచి రికార్డ్ చమురు కొనుగోళ్లు
- Advertisement -
- Advertisement -



