మండలిలో సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం డిమాండ్
సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఫార్మా కంపెనీలను చౌటుప్పల్ ప్రాంతం నుంచి తరలించాలని సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనమండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ”ఫార్మా, బల్క్ డ్రగ్ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విష రసాయన వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. అక్కడి ప్రజలు గొంతు నొప్పి, శ్వాసకోశ, ఊపిరితిత్తులు, కంటి, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ప్రాంతం మరో పటాన్చెరుగా మారే ప్రమాదం ఉంది. రసాయన, ఫార్మా పరిశ్రమల నుంచి ప్రమాదకరమైన వ్యర్థాలను నియంత్రించడంలో కాలుష్య నియంత్రణ మండలి విఫలమవుతోంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండాసురేఖ సమాధానం చెబుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలుష్యం వల్ల కలిగే పంట నష్టంపై కమిటీ వేయాలని కలెక్టర్ను ఆదేశించినట్టు తెలిపారు. ఈ ప్రాంతం నుంచి పరిశ్రమల తరలింపునకు సంబంధించి సీఎంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి బీఆర్ఎస్ సభ్యులు ఎల్.రమణ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ రూ.350 కోట్లతో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని తెలిపారు. మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచన మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
చౌటుప్పల్ నుంచి ఫార్మా పరిశ్రమలను తరలించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



