మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్రెడ్డి, భవానీరెడ్డి విన్నవించారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రితో వారు భేటీ అయ్యారు. కొనుగోలు సెంటర్ల వద్ద రైతులకు పక్కా రసీదులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడ్తున్న తీరును వివరించారు. ఇక తూకం వేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపి అక్కడ దింపే వరకు రైతులను బాధ్యులుగా చేస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై రైతు కమిషన్కు చాలా ప్రాంతాల నుంచి రైతులు ఫిర్యాదులు చేసినట్టు తెలిపారు. వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫోన్ చేసి ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.



