తక్కళ్లపల్లి రవీందర్రావు
సమృద్ధిగా యూరియా నిల్వలు : తుమ్మల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యూరియా కోసం రైతులు రాత్రుళ్లు షాపుల ముందు చలిలో పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్ సభ్యులు తక్కళ్లపల్లి రవీందర్రావు శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనమండలిలో సర్కార్ను నిలదీశారు. ”గత సర్కార్ పదేండ్ల పాలనలో రైతులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న దాఖలాలు లేవు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రవేశపెట్టిన కృషి వికాస్ యోజన యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ఫోన్లు లేకపోవడం, ఇంటర్నెట్ రాకపోవడం, సర్వర్ బిజీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తదితర సాంకేతిక సమస్యలతో యూరియాను సరైన సమయంలో పొందలేకపోతున్నారు. యాప్లో తలెత్తిన సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లేదు. స్మార్ట్ ఫోన్ లేని వారు కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయం చూపలేదు.
సాంకేతిక సమస్యలకు తోడు సరైన స్టాక్ అందుబాటులో లేకపోవడంతో రాత్రుళ్లు రైతులు జాగారం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే సర్కార్ రైతులకు యూరియాను అందుబాటులో తేవాలి” అని ఆయన డిమాండ్ చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమాధానం చెబుతూ రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేశామనీ, ఇది గత ఎనిమిదేండ్లల్లో అత్యధికమని చెప్పారు. ”రాష్ట్రంలో ఉన్న 12,000 సెంటర్లలో, ఎక్కడో 2, 3 సెంటర్లలో ఉన్న లైన్లను చూపి రాజకీయ పబ్బం గడపాలను కుంటున్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ రాష్ట్రంలో కూడా అమలు చేశాం. దీన్ని తీసుకొచ్చే ముందు రైతులందరికీ అవగాహన కల్పించాం.



