– 20 నెలలు గడిచినా సీఎం రేవంత్ పింఛన్లు పెంచడం లేదు
– ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ అడగడం లేదు
– పింఛన్లు పెంచకుంటే సీఎం రాజీనామా చేయాలి
– పెన్షన్ల పెంపు సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాద్లో భారీ సభ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-గజ్వేల్
సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ దేశంలో నెంబర్ వన్ మోసగాళ్ళని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి పెన్షన్లు పెంచకుండా వృద్ధులు, వికలాంగులను మోసం చేస్తుంటే.. ప్రతిపక్ష నాయకుని హౌదాలో ఉండి కూడా కేసీఆర్ మౌనం వహిస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శోభ గార్డెన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఆయన హాజరై ప్రసంగించారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా సీఎం రేవంత్ రెడ్డి పెన్షన్లు పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటినుంచే పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పేదల గురించి కేసీఆర్ అడగడం లేదని, ఇప్పటికైనా మౌనం వీడాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుని పాత్రలో కేసీఆర్ పూర్తిగా విఫలమ య్యారన్నారు. 2007 నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రారంభించి పేదల కోసం పోరాడానని, ఆ ఫలితంగానే ప్రస్తుతం ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తున్నాయన్నారు. ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్షనేత కేసీఆర్కు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఓటేయొద్దని పిలుపునిచ్చారు. పింఛన్ పెంచుతావా లేక రాజీనామా చేస్తావా తేల్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. పెన్షన్ల పెంపు సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాద్లో భారీ సభను నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కామల్ల భూమయ్య, ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద కుమార్, జిల్లా ఇన్చార్జి మల్లిగారి యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మొక్కపల్లి రాజు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు బుడిగే మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి ఉబ్బని ఆంజనేయులు, టీజీడీజే ఏసీ బాబు, దుర్గయ్య, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి, కేసిఆర్ దేశంలోనే నెంబర్ వన్ మోసగాళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES