Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి
 భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి మండలం ఎస్ ఎం కొత్తపల్లి, చిట్యాల మండలం దూతపల్లి గ్రామాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్జీదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్, రిజిష్టర్ లో నమోదు చేస్తున్నారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులను  రిజిస్టర్లలో నమోదు చేయాలని  ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్ లను, రిజిస్టర్లను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను   విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే  పరిష్కరించాలని అన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని, భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.

సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.  దరఖాస్తుదారుల సమస్య పరిష్కారంలో కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోవద్దని, సదస్సులకు ఆర్జీలు అందించేందుకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పని చేయాలని సూచించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి, చిట్యాల తహసీల్దార్లు శ్రీనివాసులు, ఇమాం పాషా, భూపాలపల్లి డిప్యూటీ తహసిల్దార్ అంజలి రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామస్వామి, అజారుద్దీన్, అసిస్టెంట్ సర్వేయర్ శివ, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -