Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఎస్‌ఎల్‌బీసీ పనుల్ని పునరుద్దరించండి

ఎస్‌ఎల్‌బీసీ పనుల్ని పునరుద్దరించండి

- Advertisement -

– సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
– రక్షణ చర్యలతో ముందుకే సాగాలని నిర్ణయం
– ఆర్మీ అధికారుల సేవల్ని వినియోగించుకోండి
– 2027 డిసెంబరు 9 లోపు పనులు పూర్తిచేయాలి
– అదేరోజు జాతికి అంకితం చేస్తాం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఎస్‌ఎల్‌బీసీ పునరుద్దరణ పనుల్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను అదేశించారు. గత అనుభవాలు, దుర్ఘటనల్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులకు పూర్తిస్థాయి రక్షణ చర్యలు ఇస్తూ, పనుల్ని కొనసాగించాలని చెప్పారు. అనుభవమున్న ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ టన్నెల్‌ పనులు పూర్తయితే ఫ్లోరోసిస్‌ పీడిత నల్లగొండ జిల్లాకే కాకుండా తెలంగాణకే అత్యంత కీలక నీటి సరఫరా మార్గంగా మారుతుందని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. గురువారం సీఎం నివాసంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సలహాదారులు అదిత్యాదాస్‌నాద్‌, ఇండియన్‌ ఆర్మీ రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ హర్పాల్‌సింగ్‌, స్పెషల్‌ సెక్రటరీ, ఇండియన్‌ ఆర్మీ కల్నల్‌ పరీక్షిత్‌ మెహరా, ఈఏన్సీలు అంజత్‌ హుస్సేన్‌, ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌కుమార్‌, చీఫ్‌ సైంటిస్ట్‌ హెచ్వీఎస్‌ సత్యనారాయణ, జీఎస్‌ఐ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కేవీ మారుతి, డైరెక్టర్‌ శైలేంద్ర కుమర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్‌లో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్‌ ప్రాజెక్ట్‌లకు ఆదర్శంగా ఉండేలా ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణం పూర్తి చేయాలనీ, ఇదో కేస్‌స్టడీగా ఉండాలనే అకాంక్షను వెలిబుచ్చారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామనీ, అటవీశాఖ, ఇంధన శాఖ ఇరిగేషన్‌ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి అదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ పునరుద్దరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15లోగా క్యాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. వెంటనే సంబంధిత విభాగాల అధికారుల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఒక్క సమావేశంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించారు. అటవీ శాఖ అనుమతులపైన ప్రత్యేక దష్టి పెట్టాలనీ, ఎస్‌ఎల్‌బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరగాలన్నారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే ఎలాంటి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి అవకాశముందన్నారు. 2027 డిసెంబరు 9లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనీ, అదేరోజు దీన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని సీఎం గడువు నిర్ణయించారు. దీనికోసం ప్రతి మూడు నెలల ప్లానింగ్‌ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ జేపి అసోసియేట్స్‌ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలనీ, కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదన్నారు. ఇన్లెట్‌, ఔట్లెట్‌ రెండు వైపుల నుంచి పనులు చేపట్టాలనీ, అందుకు అవసరమైన యంత్ర పరికరాలతో పాటు నిపుణులు, కార్మికులను రంగంలోకి దింపాలని సూచించారు.

ఎస్‌ఎల్‌బీసీ పనులకు గ్రీన్‌ఛానల్‌లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి గాను ఇప్పటికే 35 కిలోమీటర్ల సొరంగం తవ్వడం పూర్తి అయ్యిందని గుర్తుచేశారు. మిగతా తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నట్టు ఈ సందర్భంగా పరీక్షిత్‌ మోహ్ర వివరించారు. ప్రతి నెలా 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన నేషనల్‌ జియో ఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) ద్వారా హెలీ-బోర్న్‌ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనివల్ల సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad