నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా టిప్పర్ ఢీకొనడంతో తల్లి రమాదేవి, కుమార్తె తేజస్వి అక్కడికక్కడే మృతి చెందారు. మంచిర్యాల పట్టణానికి చెందిన విశ్రాంత సింగరేణి కార్మికుడు విఘ్నేశ్ కు స్రవంతి, తేజస్వి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరిగి అమెరికాలో స్థిరపడ్డారు.
తేజస్వి గృహప్రవేశం కోసం గత నెల 18న విఘ్నేశ్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికా వెళ్లారు. శుక్రవారం పెద్ద కుమార్తె కుమారుడు నిశాంత్ పుట్టినరోజు కావడంతో విఘ్నేశ్, రమాదేవి, తేజస్వి కారులో స్రవంతి ఇంటికి వెళ్లారు. శనివారం వారు తిరుగు ప్రయాణమయ్యారు. దురదృష్టవశాత్తూ వారి కారును ఒక టిప్పర్ ఢీకొనడంతో రమాదేవి, తేజస్వి మృతి చెందగా, ఇతర కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.