– ఆయన ఆత్మహత్య కారకుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు
– గిరిజనులు, దళితులను దేశంలో బతకనివ్వండి
– దేశ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దళిత బిడ్డ వేముల రోహిత్ ఆత్మహత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా త్వరలో తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురానున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తద్వారా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు సమాన హక్కులు ఉండాలని కోరుకునే వారికి రక్షణ కల్పిస్తామని చెప్పారు. రోహిత్ వేముల కేసును తాము పునర్విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. రోహిత్ మృతికి కారకులైన వారినెవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. అయితే… ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి బీజేపీ పెద్ద పీటవేసి, ఉన్నత పదవులను కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ విభాగం చైర్మెన్ రాజేంద్ర పాల్ గౌతమ్తో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ”హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అడ్మిషన్లు తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషం, ఒక తాడును కూడా ఇస్తే వారు ఉరి వేసుకోవడానికి పనికొస్తుందని రోహిత్ వేముల వీసీకి రాసిన సూసైడ్ నోట్లో ఉంది. అప్పట్లో ఇది దేశ ప్రజల మనసులను కలచివేసింది” అని డిప్యూటీ సీఎం వివరించారు. హెచ్సీయూలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ వర్సిటీ వీసీకి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వినతిపత్రాన్ని అందజేసిందని తెలిపారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని హెచ్సీయూ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్ కుమార్.. రోహిత్ వేములతో పాటు అసోసియేషన్లోని మరో నలుగురు సభ్యులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వీసీకి ఫిర్యాదు చేశారన్నారు. ఆ నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని వీసీపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నుంచి కూడా వీసీపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో యూనియన్ సభ్యులపై పోలీసు కేసులు నమోదు చేశారన్నారు. నలుమూలల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక వర్సిటీ అధికారులు రోహిత్ వేములతో పాటు మరో నలుగురిని రెస్ట్ గేట్ చేయడంతో మరో మార్గం లేక రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారని భట్టి విక్రమార్క వివరించారు.
ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి,
మరొకరి ఢిల్లీ ప్రొఫెసర్ పోస్ట్
పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రామచంద్రరావును ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారని భట్టి విక్రమార్క విమర్శించారు. అలాగే రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న సుశీల్ కుమార్కు ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి కట్టబెట్టిందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులను ఇబ్బంది పెట్టి వారు మరణం అంచుల దాకా వెళ్లేలా టార్గెట్ చేసే వారికి బీజేపీ నాయకత్వం పదవులు, ప్రోత్సాహకాలు ఇచ్చి తమ మార్క్ను చూపించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బిడ్డలపై చూపుతోన్న వివక్షకు బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కలిసి టీం వర్క్గా పని చేస్తున్నాం
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం బాగానే ఉందనీ, అందరం కలిసి టీం వర్క్తో పని చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పవర్ షేరింగ్ అంటూ ఏమి లేదని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ భవన్ శబరి బ్లాక్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరి పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో, వారి నిర్ణయం ఏంటో తెలియదని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు, వంద శాతం రుణమాఫీ చేసినట్టు వెల్లడించారు. ఫోర్త్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయనీ, మూసీ సుందరీకరణ ఈ ప్రభుత్వం హయంలో పూర్తి అవుతాయని అన్నారు. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుందన్నారు. పాశమైలారం సిగాచి ప్రమాదం పై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు.
త్వరలో రోహిత్ వేముల చట్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES