నవతెలంగాణ-హైదరాబాద్ : క్రిస్మస్ వేళ తన ఉద్యోగులకు ఓ సీఈఓ భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. రూ.2000కోట్ల బోనస్ను కేటాయించారు. 540 మంది ఉద్యోగులకు ఈ మొత్తం అందేలా చూశారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..
అమెరికాలోని లూసియానా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఫైబర్బాండ్ సంస్థకు గ్రాహమ్ వాకర్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన ఈ నిర్మాణ రంగ కంపెనీని 1.7 బిలియన్ డాలర్లకు ఇటీవల విక్రయించారు. ఈ విక్రయానికి ముందే కొనుగోలుదారైన ఈటన్ సంస్థకు ఒక కండీషన్ పెట్టారు. 15 శాతం వాటా (సుమారు రూ.2వేల కోట్లు)ను కొన్నేళ్లుగా ఈ సంస్థలోనే కొనసాగుతోన్న 540 మంది ఉద్యోగులకు కేటాయించాలని స్పష్టంగా చెప్పారు. అందుకు ఈటన్ అంగీకరించడంతో రానున్న ఐదేళ్ల కాలంలో ఆ సిబ్బంది ఒక్కొక్కరికీ రూ.4 కోట్ల మేర అందనుంది. ఇప్పటికే అది వారి ఖాతాల్లో జమ కావడం ప్రారంభమైంది. ఆ ఉద్యోగులు కొత్త యాజమాన్యం కింద దీర్ఘకాలం ఉద్యోగంలో కొనసాగితే… వారికి అందే మొత్తం ఇంకా పెరగనుంది.
తొలుత ఈ వార్తను ఎవరూ నమ్మలేదు. ‘‘ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది మాకు లాటరీనే’’ అని బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోన్న హెక్టర్ మొరెనో పేర్కొన్నారు. 1995 నుంచి ఆ సంస్థలో పనిచేస్తోన్న లేసియాకీ.. తమకు కేటాయించిన మొత్తం గురించి తెలుసుకొని ఉద్వేగానికి గురయ్యారు. ఈ డబ్బుతో తన అప్పులు తీర్చుకుంటానని చెప్పారు. ఇలా ఉద్యోగులు ఒక్కోలా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రాహమ్ తండ్రి క్లాడ్ వాకర్ ఈ ఫైబర్బాండ్ సంస్థను 1982లో స్థాపించారు. డిసెంబర్ 31న సీఈఓ పదవి నుంచి గ్రాహమ్ దిగిపోనున్నారు. ప్రస్తుతం ఈ బోనస్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.



