నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి

నవతెలంగాణ – రేవల్లి:  మండల కేంద్రంలో రూ.4.87 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయ నూతన భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం రోజు  ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మంత్రిగారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అందమైన, అత్యధునాతన విద్యాలయంగా రేవల్లి కేజీబీవీ నిలిచిందని ఆయన అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతంగా ఎదగాలి అని, కేజీబీవీ నిర్మాణానికి కృషిచేసిన ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు, కాంట్రాక్టర్ కు అభినందనలు తెలిపారు. పాఠశాల ఆవరణను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని 15 కేజీబీవీలలో అన్నింటికీ సొంత భవనాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. పాఠశాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఆయన అన్నారు. 15 కేజీబీవీలలో ఐదింటిలో ఇంటర్మీడియట్ విద్య కొనసాగేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రేవల్లి కేజీబీవీలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్ తరగతులు ప్రారంభం అయ్యేలాగ చూస్తానని తెలిపారు. అలాగే త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అలాగే అన్ని విద్యాలయాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. అదేవిధంగా, కెజిబివి బాలికలను ఉద్దేశించి, రాబోయే కాలంలో ఇంజినీర్లు ఎంత మంది అవుతారని, డాక్టర్లు ఎంత మంది అవుతారని, లాయర్లు ఎంతమంది అవుతారని అడుగుతూ, ఎంతమంది వ్యవసాయం చేస్తారని అడిగి, భవిష్యత్ లో ఆధునిక వ్యవసాయం చేసిన వారికే డిమాండ్ ఉంటుందని ఆయన తెలిపారు. తర్వాత రేవల్లి మండల  కేంద్రంలోని ప్రధాన రహదారి మొత్తం రూ.86 లక్షలతో సీసీ నిర్మాణం చేపట్టబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు దొడ్ల రాములు, సింగిల్ విండో చైర్మన్ లోడే రఘు, జడ్పిటిసి భీమయ్య, రేవల్లి సీనియర్ నేత శివరాం రెడ్డి, నాగపూర్ సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్, ఎంపిటిసి శ్రీశైలం, మాజీ ఎంపీపీ జానకి రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ పూర్ణకంటి కిరణ్, వైస్ ఎంపీపీ మధు, ఎంపీపీ సేనాపతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love