– డాలర్ @88.27 మోడీ హయాంలో సరికొత్త రికార్డ్
– ఆల్టైం కనిష్టంతో అధిక ధరలకు ఆజ్యం
– ప్రమాదంలో భారత ఆర్థిక వ్యవస్థ
– సామాన్యులపై తీవ్ర ప్రభావం
భారాలు ఇలా..
దిగుమతి వ్యయాలు భారమౌతాయి.
ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
వడ్డీ రేట్లు పెరుగుతాయి.
విదేశీ రుణ చెల్లింపులు భారం అవుతాయి.
విదేశీ పెట్టుబడులు వెనకడుగు వేస్తాయి.
వాణిజ్య లోటు పెరుగుతుంది.
విదేశీ ప్రయాణాలపై ఖర్చులు పెరుగుతాయి.
దిగుమతి ఆధారిత కంపెనీల పెట్టుబడులు పెరిగి, ఆదాయాలు క్షీణిస్తాయి.
స్టాక్ మార్కెట్లపై విశ్వాసం పోతుంది.
చిట్యాల మధుకర్
జీఎస్టీని రెండు శ్లాబులకు తగ్గించి, సామాన్యులపై ఆర్థిక భారాలు తగ్గించామని మోడీ సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో భారతదేశ రూపాయి విలువ డాలర్తో పోల్చినప్పుడు రూ.88.27 పైసలకు పడిపోయింది. ఇది కూడా మోడీ హయాంలో సరికొత్త రికార్డు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో రూపాయి పతనం కాలేదు. రూపాయి పతనం వల్ల అంతర్జాతీయంగా అష్టకష్టాలతో పాటు స్వదేశంలోనూ జీఎస్టీ తగ్గింపు ఫలితాలు సామాన్య ప్రజానీకానికి అందే పరిస్థితి కనిపించట్లేదు. 2013లోనే మోడీ రూపాయి విలువను పడిపోనివ్వబోమనీ, దాని విలువ పెంచుతామని ఓటర్లకు వాగ్దానాలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన ప్రధానిగా అధికారంలోకి వచ్చాక రూపాయి విలువ క్రమేణా దిగజారుతూ వస్తోంది. మోడీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసిన 2014లో రూపాయి విలువ డాలర్తో రూ. 62.33పైసలుగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూపాయి విలువ 38.87 శాతం క్షీణించి, మరింత బక్కచిక్కిపోయింది. 2019 రెండోసారి అధికారంలోకి వచ్చేటప్పటికీ డాలర్తో రూపాయి విలువ రూ.72 కు పడిపోయింది. గడిచిన ఐదేండ్లలోనే 20 శాతం పైగా విలువ కోల్పోయింది. వచ్చే ఐదేండ్లలోనూ ఇదే స్థాయిలో పతనం కావొచ్చని పలు అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నివేదికలు చెప్తున్నాయి. 2030 నాటికి అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 100కు పడిపోవచ్చని పలు రిపోర్ట్లు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ట్రంప్ టారిఫ్ చిచ్చులకు రూపాయి చిత్తడి అవుతుంటే ప్రధాని మోడీ సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ దీనిపై నోరు విప్పే సాహసం కూడా చేయట్లేదు. కనీసం రూపాయి పతన కట్టడికి తీసుకుంటున్న చర్యలను కూడా వెల్లడించట్లేదు.
పతనానికి ప్రధాన కారణాలు..
భారత్పై అమెరికా వేసిన భారీ టారిఫ్లకు తోడు, విదేశీ నిధులు బయటకు తరలిపోవడం, ఎఫ్డిఐలు ముఖం చాటేయడం, రూపాయి పతనాన్ని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడం తదితర పరిణామాలు దేశీయ కరెన్సీని అగాథంలోకి నెట్టాయి. దేశంలో అధిక ద్రవ్యోల్బణం, దిగుమతుల కంటే ఎగుమతులు పెరగడం వల్ల ఫారెక్స్ రిజర్వులపై ఒత్తిడి, డాలర్కు విలువ పెరగడం, చమురు ధరల పెరుగుదల వల్ల విదేశీ చెల్లింపులు పెరగడం, దేశంలో అనాలోచిత ఆర్థిక విధానాలు రూపాయి విలువను క్రమంగా దిగజారుస్తున్నాయి. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు ఆగకపోవడం కూడా రూపాయి పతనానికి కారణంగా కనిపిస్తోంది.
భారంగా విదేశీ అప్పుల చెల్లింపులు
భారత్లోకి వచ్చి.. పోయే విదేశీ కరెన్సీ ఆధారంగా లెక్కించే కరెంట్ ఖాతా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ లోటును ఎదుర్కోవచ్చని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. డాలర్ విలువ పెరగడం.. రూపాయి అమాంతం బక్కచిక్కడంతో ప్రపంచ దేశాల నుంచి భారత్ తీసుకున్న అప్పులపై అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. దిగుమతులు, అప్పులు, వడ్డీలకు చేసే విదేశీ చెల్లింపులతో భారత మారకం నిల్వలపై ఒత్తిడి చోటు చేసుకుంటోంది. దిగుమతులు ఎక్కువ కావడం వల్ల వర్తక లోటు పెరిగి, రూపాయిపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఆయిల్, గ్యాస్, సోలార్, టెలికాం రంగాల్లో ఖర్చులు పెరగడంతో, లాభాలవాటాలు కూడా తగ్గుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా భారత్ చేసిన అప్పులు తీర్చాలంటే, దిగజారిన రూపాయి విలువతో పోల్చి డాలర్ల రూపంలో వాటిని తీర్చాల్సి ఉంటుంది. దీనితో దేశ ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికరంగ విశ్లేషకులు చెప్తున్నారు.