Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్థిక బలోపేతంతోనే గ్రామీణాభివృద్ధి

ఆర్థిక బలోపేతంతోనే గ్రామీణాభివృద్ధి

- Advertisement -

రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మెన్‌ సిరిసిల్ల రాజయ్య
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధికారులతో సమావేశం


నవతెలంగాణ-ఆదిలాబాద్‌ టౌన్‌
స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతం కావడం ద్వారానే గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మెన్‌ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులు రమేష్‌, కార్యదర్శి కాత్యాయినిదేవి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్లు, డీసీసీబీ చైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మెన్‌ మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి కమిషన్‌ పర్యటిస్తుందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాంగాన్ని సవరించి ఫైనాన్స్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారని, దానికి అనుగుణంగా కమిషన్‌ పని చేస్తుందని తెలిపారు. నిర్లక్ష్యానికి గురవుతున్న గ్రామపంచాయతీల గురించి తెలుసుకుంటూ వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు.

జిల్లాల వారీగా ఆర్థిక వనరుల ద్వారా సమకూరుతున్న నిధుల గురించి తెలుసుకుంటున్నామని అన్నారు. ఆ నిధులు ఏ విధంగా పెంచుకోవాలి, ఎలా ఖర్చు చేయాలి, ఏఏ అభివృద్ధి పనులకు కేటాయించాలో చర్చించి నివేదికలను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. నిధుల వినియోగం పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని, పంచాయతీలు, మున్సిపాలిటీ లు ప్రజల ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర నిధుల ద్వారా గ్రామ పంచాయతీల ను బలోపేతం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం ఫలాలు సామాన్య ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనానికి వినియోగించబడాలన్నారు.

వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ, అటవీ, చిన్నతరహా పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం వంటి రంగాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి పునాదులని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో, సమగ్ర ప్రణాళికతో పనిచేస్తే స్థిరమైన గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్‌, కుమార్‌ దీపక్‌, వెంకటేష్‌ దోత్రే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు సోమ రాజేశ్వర్‌, ఫైజాన్‌ అహ్మద్‌, దీపక్‌ తివారి, ఆర్డీఓ స్రవంతి, పంచాయతీరాజ్‌, శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -