Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో కాషాయ కుతంత్రం

బీహార్‌లో కాషాయ కుతంత్రం

- Advertisement -

బీహారీలు మోసపోయారన్న తేజస్వి యాదవ్‌
పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం
బీజేపీ ఒత్తిళ్లతోనే ముగ్గురు వైదొలగారన్న ప్రశాంత్‌ కిషోర్‌
143మంది అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ
అసెంబ్లీ ఎన్నికల వేళ రసకందాయంలో రాజకీయం

పాట్నా, న్యూఢిల్లీ: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. ఓటమి భయంతో బీజేపీ, జేడీయూ కూటమి పలు కుతంత్రాలకు పాల్పడుతోందని ఇండియా బ్లాక్‌ నేతలు విమర్శిస్తున్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత ససారామ్‌ సీటు నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా నామినేషన్లు వేసిన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు అభ్యర్థులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. మరోవైపు బీజేపీ ఒత్తిళ్లతోనే తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు బరి నుంచి వైదొలిగారని.. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్‌ కిషోర్‌ మంగళవారం చెప్పారు. పాట్నాలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంలో పాలక ఎన్‌డీఏ ఉందనీ, అందుకే ఎన్నిల బరి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాల అభ్యర్థులను బెదిరిస్తోందని విమర్శిం చారు. ”ప్రజాస్వామ్యం హత్య చేయబడుతోంది. దేశంలో ఇంతకుముందెన్నడూ ఇలాంటిది జరగ లేదు.” అని ఆయన వ్యాఖ్యానించారు. అభ్యర్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల కమిషన్‌ను కోరారు. దానాపూర్‌, బరంపురం, గోపాల్‌గంజ్‌ సీట్ల నుంచి ఉపసంహరించుకోవాలని ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై వారు ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. సూరత్‌ నమూనానే ఇక్కడా అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. మిగిలిన అభ్యర్థులం దరినీ వైదొలిగేలా అక్కడ ఒత్తిడి తెచ్చారు. అందు వల్లే దేశవ్యాప్తంగా ఓటర్లు బీజేపీని శిక్షించారని, కేవలం 240 సీట్లు మాత్రమే గెలిచిందని, బీజేపీ ఇది గ్రహించలే కపోతోందని అన్నారు. బీహార్‌లో 243 సీట్లకూ ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ముగ్గురు అభ్యర్థులు వైదొలగడంతో ఇక 240 సీట్లకూ పోటీ చేస్తోంది.

ఆర్జేడీ అభ్యర్థి అరెస్టు
రాష్ట్రంలోని ససారామ్‌ అసెంబ్లీ సీటు నుంచి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన వెంటనే ఆర్జేడీ అభ్యర్థి సత్యేంద్ర షాను అరెస్టు చేశారు. ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారంటు పెండింగ్‌లో ఉందంటూ జార్ఖండ్‌ పోలీసులు షాను అదుపులోకి తీసుకున్నారని సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులు తెలిపారు. కాగా ఆయన మద్దతుదారులకు ఈ పరిణామాలు గురించి తెలియడం లేదు. నామినేషన్‌ వేసేందుకు ఆయనను అనుమతించారని, ఆ వెంటన ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్ళారని రోV్‌ాతస్‌ జిల్లా సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 2004 బ్యాంక్‌ దోపిడీ కేసులో షా నిందితుడని జార్ఖండ్‌ పోలీసులు తెలిపారు. ఆ కేసులో 2018లో షాపై శాశ్వత వారంటు జారీ అయిందని సదర్‌ పోలీసు స్టేషన్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జి సునీల్‌ తివారీ తెలిపారు. దోపిడీలు, దొంగతనాలు, ఆయుధ చట్టం ఉల్లంఘనలు ఇలా 20కి పైగా కేసులు ఆయనపై పెండింగ్‌లో ఉన్నాయి.

నామినేషన్‌ పత్రాలు వేసిన తర్వాత ఇండియా బ్లాక్‌ అభ్యర్థులు ఇలా అరెస్టు కావడం ఇది మూడో ఘటన. ఇంతకుముందు భోర్‌, దరౌలి సీట్ల నుంచి నామినేషన్లు వేసిన సీపీఐ(ఎంఎల్‌) అభ్యర్థులు జితేంద్ర పాశ్వాన్‌, సత్యదేవ్‌ రామ్‌లను అరెస్టు చేశారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసినవని ఈ అరెస్టులను ఖండిస్తూ సీపీఐ(ఎంఎల్‌) ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలను ఎదుర్కోలేక బీజేపీ-జేడీయూ కూటమి ఇలా అణచివేత చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది.

బీహారీలు ఇక మోసపోకండి : తేజస్వి యాదవ్‌
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ విరుచుకుపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. బీహార్‌లో పారిశ్రామికాభివృద్ధికి భూమి కొరతే ప్రధాన అడ్డంకిగా ఉందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై తేజస్వి స్పందించారు. ”20 ఏండ్లు బీహార్‌లో ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత కూడా హోం మంత్రి సాకులు చెబుతున్నారు. గుజరాత్‌లో మాత్రమే కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికులు మాత్రం బీహార్‌కు చెందినవారు. బీహారీలు ఇకపై మోసపోకండి అని తేజస్వి యాదవ్‌ రాష్ట్ర ప్రజలకు సూచించారు.

పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) తప్పుకుంది. మహాగట్‌ బంధన్‌లో ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో సీట్ల సర్దుబాటు విషయంలో ఒప్పందం కుదరక ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జేఎంఎం పార్టీ సోమవారం ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియకు ముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తోనూ, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీతోనూ సీట్ల సర్దుబాటుపై జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ చర్చలు జరిపారు. జార్ఖండ్‌, బీహార్‌ సరిహద్దు జిల్లాల్లో దాదాపు 20కి పైగా సీట్లలో పోటీ చేసేందుకు జేఎంఎం సిద్ధమైంది. కచ్చితంగా ఈ జిల్లాల్లోని నియోజకవర్గాలను తమ పార్టీకి కేటాయించాలని జేఎంఎం పట్టుబట్టింది. అయితే జేఎంఎం కోరినట్టు కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలు ఆ స్థానాల్ని కేటాయించలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని జేఎంఎం పార్టీ నిర్ణయం తీసుకుంది.

143మందితో ఆర్జేడీ అభ్యర్థుల జాబితా
రెండో దశ ఎన్నికల ప్రక్రియకు అక్టోబర్‌ 20తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. దీంతో సోమవారం ఆర్జేడీ 143 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 24 మంది మహిళలు, 16 మంది ముస్లింలు ఉన్నారు. కాంగ్రెస్‌ కూడా ఆరుగురు అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. మొత్తం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 60 స్థానాల్లో బరిలోకి దిగనుంది.

లాలూపై విమర్శలతో నితీశ్‌ ప్రచారం
అధికారంలో ఉండగా లాలూ ప్రసాద్‌ మహిళలకు చేసిందేమీ లేదంటూ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ విమర్శించారు. ముజఫర్‌ జిల్లాలోని మీనాపూర్‌ నియోజకవర్గంలో మంగళవారం తన ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన మాట్లాడారు. పెద్ద ఎత్తున స్వయం సహాయక గ్రూపులను ప్రారంభించామని చెప్పారు. ఇటీవలే ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన ప్రారంభించామన్నారు. ఏడేండ్లు గడిచిన తర్వాత ముఖ్యమంత్రిగా గద్దె దిగాల్సిన పరిస్థితి వచ్చినపుడు మాత్రం భార్యను ముఖ్యమంత్రిని చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భయానక వాతావరణం పోయిందని చెప్పుకున్నారు. శాంతి భద్రతలు మెరుగయ్యాయన్నారు.
నవంబరు 6, 11 తేదీల్లో రెండు దశల్లో బీహార్‌ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశకు ఈ ఆంక్షలు 5,6 తేదీలకు వర్తిస్తాయి. రెండో దశకు 10, 11 తేదీలకు వర్తిస్తాయి. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఉప ఎన్నికలను ఈసీ ప్రకటించింది.

ఒకవేళ ప్రింట్‌ మీడియాలో రాజకీయ అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వాలనుకునే వారు ఏ రోజునైతే యాడ్‌ ప్రచురించాలనుకుంటారో దానికి రెండు రోజులు ముందుగా ఎంసిఎంసికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది. సక్రమ ప్రచార వాతావరణం వుండేలా, తప్పుడు సమాచారాన్ని నివారించేలా లేదా చివరి నిమిషంలో నిర్ధారితం కాని విషయాల ద్వారా అవకతవకలు జరగకుండా అడ్డుకునేందుకే ఈ చర్య ఉద్దేశించబడిందని ఈసీ తెలిపింది. సకాలంలో ఆమోదం పొందేందుకు గానూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంసీఎంసీలు ఇలాంటి దరఖాస్తులపై సత్వరమే స్పందించాలని కోరినట్టు ఈసీ పేర్కొంది.

ముందస్తు అనుమతి లేకుంటే నో యాడ్స్‌ : ఈసీ
ముందస్తు అనుమతి, ధ్రువీకరణ లేకుండా పోలింగ్‌ రోజున, అంతకుముందు రోజున ప్రింట్‌ మీడియాలో ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి, సంస్థ లేదా వ్యక్తి వాణిజ్య ప్రకటనలను ప్రచురించడానికి అనుమతించబోమని ఎన్నికల కమిషన్‌ మంగళవారం స్పష్టం చేసింది. మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) ఆ సమాచారాన్ని చూసి, ముందుగా సర్టిఫై చేస్తేనే దాన్ని యాడ్‌గా ప్రచురించవచ్చని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -