– జూన్లో పెరిగిన పాలసీ అమ్మకాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోని వాటాలను విక్ర యించాలని మోడీ సర్కార్ యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వాటాను విక్రయించడానికి వీలుగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ప్రణాళికలు రూపొంది స్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2022 మే నెలలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లో భాగంగా 3.5 శాతం వాటాను కేంద్రం విక్రయించింది. ఐపీఓలో ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.902-949గా నిర్ణయించి.. వాటాలను విక్రయించడం ద్వారా రూ.21 వేల కోట్లు తన ఖజానాలో వేసుకుంది. కేంద్రానికి ప్రస్తుతం ఎల్ఐసీలో 96.5 శాతం వాటా ఉంది.
ఈ దఫా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో భాగంగా తదుపరి వాటా విక్రయానికి మోడీ సర్కార్ గ్రీన్ సిగల్ ఇచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే.. ప్రస్తుతానికి ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయని తెలుస్తోన్నప్పటికీ.. పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియ త్వరలోనే వేగవంతం అయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వాటా విక్రయ ప్రక్రియను పెట్టుబడుల ఉపసంహరణ విభాగం పూర్తి చేయనుంది.
2027 మార్చి 16 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ను 10 శాతం ఉండాలన్న నిబంధనను చేరుకోవడంలో భాగంగా మరో 6.5 శాతం వాటాను కేంద్రం విక్రయించాల్సి ఉంటుంది. అయితే.. ఎప్పుడు, ఎంతమేర వాటా విక్రయిస్తారనే అనే వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. కాగా.. త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తర్వాత వాటాల విక్రయం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.5.85 లక్షల కోట్లుగా ఉంది. గురువారం బీఎస్ఈలో ఎల్ఐసీ షేర్ 2.01 శాతం నష్టపోయి 926.85 వద్ద ముగిసింది. ఈ ఏడాది జూన్లో ఎల్ఐసీ వ్యక్తిగత ప్రీమియం ఆదాయం 14.60 శాతం పెరిగి రూ.5,313 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే నెలలో 12.49 లక్షల పాలసీలను జారీ చేయగా.. 2025 జూన్లో కొత్తగా 14.65 లక్షల పాలసీలను విక్రయించింది.