నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జూలై 21న ప్రారంభమైన ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సజావుగా చర్చలు సాగనివ్వడం లేదు. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు నిరసనలకు దిగుతున్నారు. నేడు కూడా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
రాజ్యసభ ప్రారంభం అయికాగానే ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో సభ మధ్యాహ్నం 2కి వాయిదాపడింది. ఆ తర్వాత వివిధ అంశాలపై చర్చించడానికి 267 రూల్ కింద ప్రతిపక్షాలు ఇచ్చిన 19 నోటీసులను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించారు.
నేడు లోక్సభలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు మొదటి వ్యోమగామిపై చర్చ, 2047 నాటికి వికసిత్ భారత్ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలకపాత్రపై చర్చించేందుకు ప్రభుత్వం ఎజెండాగా జాబితా చేసింది. అయితే కీలకమైన ఎస్ఐఆర్పై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడబుతున్నా.. ప్రభుత్వం మాత్రం దానిని చర్చించేందుకు అంగీకరించడం లేదు. మరోవైపు ప్రభుత్వం బిల్లుల ఆమోదం దిశగా ప్రయత్నిస్తోంది.
జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ)బిల్లు 2025ను సెలక్ట్ కమిటీ పంపాలని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ లోక్సభలో ప్రతిపాదించారు. ఈ తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు 2025ను ప్రవేశపెట్టారు