– మద్యం మత్తులో డ్యూటీ చేసే కాటారం సీఐపై విచారణ చేపట్టాలే
– మీ ఊకదంపుడు కేసులకు మా సైన్యం భయపడదు
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
నవతెలంగాణ – కాటారం
భారత రాజ్యాంగంతో ఉద్యోగాలు పొంది ప్రజలకు రక్షణగా నిలువాల్సిన ఖాకీ యూనీఫామ్ వేసుకునే పోలీసులంటే ఖాకీ డ్రెస్ వేసుకుని సమాజం, ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడే సఫాయి కర్మచారులే ఆదర్శమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. రెండు రోజుల క్రితం కాటారం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయగా బెయిల్పై వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జీ జోడు శ్రీనివాస్ను ఆయన పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత సఫాయి కర్మచారి వెంకన్న అనే కార్మికుడిని పూలమాలతో సత్కరించి కాళ్లు కడిగారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంథని నియోజకవర్గంలో పోలీసుల వ్యవహరశైలి రోజురోజుకు శృతి మించుతోందన్నారు. ఖాకీ డెస్సు వేసుకునే ఆటో డ్రైవర్లు, ఫ్యాకర్టీల్లో పని చేసే కార్మికులు, ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం మురుగు కంపును తొలగించే సఫాయి కర్మచారి కార్మికులు ఎంతో గొప్పవారని వారంతా ఆదర్శంగా నిలుస్తుంటే ఖాకీలు మాత్రం నీచంగా తయారు అవుతున్నారన్నారు. ఈ నెల 28న అర్థరాత్రి దాటిన తర్వాత కాటారం సీఐ నాగార్జున రావు తప్పతాగి తాగిన మత్తులో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ “జోకర్ తమ్ముడి” ఆదేశాలతో బీఆర్ఎస్ మండల ఇంచార్జీ జోడు శ్రీనివాస్ను అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కి పోలీసులు ఇష్టానురాజ్యాంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు భారత రాజ్యాంగం చదువకపోతే రేపటి పరిణామాలకు మీ బాధ్యులు అవుతారని, దుద్దిళ్ల రాజ్యాంగాన్ని చదవితే నేపాల్ పునరావృతం అవుతుందని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించామన్నారు.
నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టి మంథని ఎమ్మెల్యే మంట కాగుతున్నాడని, ఇది వరకే జక్కు శ్రావన్ అనే బీఆర్ఎస్ నాయకుడిపై ఎస్టీ ఆడబిడ్డతో కేసు పెట్టించారని, అలాగే జవ్వాజి తిరుపతిపై కాపు సోదరితో, అశోక్పై కాపోళ్లతో కేసులు పెట్టించిన మంథని ఎమ్మెల్యే తాజాగా జోడు శ్రీనివాస్పై ఒక గౌడతో కేసు పెట్టించారని, ఇన్ని కేసుల్లో పోలీసులు అబాసుపాలు అయ్యారని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ దుద్దిళ్ల కుటుంబం, కులం లేకపోవడంతో మన కులాల్లో కులాల చిచ్చు పెట్టిస్తున్నాడని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కొట్లాడుతుంటే మనం మాత్రం కుర్చీల్లో కూర్చోవాలనే పథకంతోనే పని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
నియోజకవర్గంలో పోలీసులు దుద్దిళ్ల రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. కనుకనే ప్రతి విషయంలో అబాసుపాలవుతున్నారని ఆయన అన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు ఉంటాయనే ఆలోచనతో గత సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే 20కిలో మీటర్ల దూరంలో ఒక సీఐ తప్ప తాగి తూలుతున్న విషయం జిల్లా ఎస్పీకి, లోకల్లో ఉండే డీఎస్పీకి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పతాగి రోడ్లపై తిరిగే కాటారం సీఐపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.