రాజకీయ ఒత్తిళ్లే కారణమంటున్న భార్య
నిర్మల్ జిల్లా ఎర్వచింతల్లో ఘటన
నవతెలంగాణ- ఖానాపూర్
ఇటీవలే సర్పంచ్గా నామినేషన్ వేసిన మహిళా అభ్యర్థి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమంటూ భార్య ఆరోపించడం ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ (సోమార్పేట్)లో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్వచింతల్ (సోమార్పేట్) గ్రామానికి చెందిన బండారి రవీందర్(54) గతంలో టీడీపీ కార్యకర్తగా పనిచేశాడు. ప్రస్తుత కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో చురుకైన నాయకుడిగా ఎదిగాడు. రైతుగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లాడు.
తన భార్య బండారి పుష్పను ఆ ఊరి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు. ఇంతలోనే గురువారం ఉదయం తన ఇంటిపక్కనున్న పశువుల కొట్టంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అందరితో కలివిడిగా మెలిగే రవీందర్ మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేపోతున్నారు. కాగా, ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య పుష్ప, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గైక్వాడ్ రాహుల్ తెలిపారు.



