Tuesday, June 3, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుస్కూళ్ల దందా!

స్కూళ్ల దందా!

- Advertisement -

– ప్రైమరీకి అనుమతి..నిర్వహణ హైస్కూల్‌
– రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల తీరు
– సెవన్త్‌ క్లాస్‌ వరకు అనుమతి..పదో తరగతి వరకూ బోధన
– పర్మిషన్‌ ఉన్న పాఠశాలల నుంచి ఎస్సెస్సీ పరీక్ష ఫీజులు
– రిజల్ట్స్‌ మాత్రం తమ పాఠశాలదేనని విస్తృత ప్రచారం
– టీసీలు, స్టడీ సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు
– చోద్యం చూస్తున్న విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి : విద్యార్థి సంఘాలు

ప్రభుత్వ అనుమతుల్లేని స్కూళ్ల దందా దర్జాగా సాగిపోతుంది. మరికొన్ని చోట్ల ప్రైమరీకి అనుమతులు తీసుకొని హైస్కూళ్లు నిర్వహిస్తున్నారు. టెన్త్‌ క్లాస్‌ రికార్డుల్లో విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న పొరపాటు జరిగినా, జీవితకాలంపాటు నానా యాతన పడాల్సిందే. మేమే ఫస్ట్‌ అంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లతో ఊదరగొడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఉచ్చులోకి లాగుతున్నారు. విద్యా ప్రాంగణాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు ఉండవు. వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. కేవలం బ్రాండ్‌ను ఒక్కసారి మార్కెట్‌ చేసుకోగలిగితే, జీవితకాలం బతికేయొచ్చనే యాజమాన్యాల అత్యాశ విద్యార్థుల కొంప ముంచుతోంది. ఇప్పుడు మళ్లీ స్కూళ్ల సీజన్‌ మొదలైంది. తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త. మీరు మోసపోయి, మీ పిల్లల భవిష్యత్‌ను ఆగం చేయకండి. అన్ని వివరాలు తెలుసుకున్నాకే అడ్మిషన్లు తీసుకోండి.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా సాగుతోంది. అనుమతులకు భిన్నంగా స్కూల్స్‌ను నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ లోపించడంతో కొన్ని పాఠశాలలు పర్మిషన్స్‌కు భిన్నంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలకు అనుమతి పొంది ప్రాథమికోన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నా ప్రశ్నించేవారు ఉండటం లేదు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులను ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు మేనేజ్‌ చేస్తుండటం వల్లనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే వాదనలూ ఉన్నాయి. అనుమతులకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాల తీరుతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ), స్టడీ సర్టిఫికెట్ల విషయంలో ఇక్కట్లకు గురవుతున్నారు. చదివిన పాఠశాల నుంచి కాకుండా మరో స్కూల్‌ నుంచి ఎస్సెస్సీ ఫీజులు చెల్లించడంతో ఆ పాఠశాలకు సంబంధిత మెమోలు వెళ్తున్నాయి. మెమోలు ఓ చోట, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు మరోచోట తీసుకోవాల్సి వస్తోంది. వీటిలో ఏదైనా పాఠశాల ఎత్తివేస్తే ఇక ఆ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అనుమతులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలపై విద్యార్థిసంఘాలు ప్రతియేటా ఆందోళనలు చేస్తున్నాయి. అయినా విద్యాశాఖ తీరులో ఎలాంటి మార్పురాకపోవడం, కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో 11,080 బడ్జెట్‌, ప్రయివేటు స్కూల్స్‌ ఉన్నాయి. 20-25 కార్పొరేట్‌ స్కూల్స్‌ గ్రూపులు ఉన్నాయి.
అనుమతులు లేకుంటే అనేక ఇక్కట్లు..
అనుమతులు తీసుకోకపోవటం.. లేదంటే ప్రాథమిక పాఠశాలలకు అనుమతి తీసుకొని ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందు లు పడటమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడు తోంది. అనుమతి లేని పాఠశాలలు ఇచ్చే టీసీలు చెల్లట్లేదు. విద్యార్థులు పదో తరగతికి వస్తే ఫీజు చెల్లించటం కుదరదు. కొన్ని పాఠశాలలు అనుమతి గడువు ముగిసినా రెన్యూవల్‌ చేయించు కోవటం లేదు. కొన్ని స్కూల్స్‌ అనుమతి ఒక చోటకు తీసుకొని మరో చోట నిర్వహిస్తున్నారు. కొన్ని కార్పొరేట్‌, ప్రయివేటు స్కూల్స్‌ ఇష్టానుసారంగా బ్రాంచీల అడ్రస్‌ను మారుస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న స్కూల్‌ బిల్డింగుల్లో తాత్కాలిక కార్యాలయాలు తెరిచి పేరెంట్స్‌ వద్ద రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అనుమతి తీసుకొని 8,9,10 తరగతుల వరకు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు సాధారణ స్కూళ్ల పేరుతో పర్మిషన్‌ పొంది ఇంటర్నేషనల్‌, టెక్నో, కాన్సెప్ట్‌ అని రకరకాల ట్యాగ్‌లు తగిలించి దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒకే పర్మిషన్‌ ఉండి పది పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకుంటున్న కార్పొరేట్‌ స్కూల్స్‌ రాష్ట్రంలో ఉన్నాయి. ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థకు చెందిన స్కూళ్లను నల్లగొండ జిల్లా దేవరకొండ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కేంద్రం ఆలియా, మిర్యాలగూడ క్యాంపస్‌లను నల్లగొండ టౌన్‌ పర్మిషన్‌ ఆధారంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపస్‌లో 400-500 మందిని జాయిన్‌ చేయించారు. ఒకే క్యాంపస్‌ అనుమతి తీసుకొని సబ్‌ క్యాంపస్‌లను బోర్డులు పెట్టకుండా నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవటం లేదు.
ఏడు వరకు అనుమతి..
పదో తరగతి దాకా నిర్వహణ
రాష్ట్రంలో అనేక పాఠశాలలను ఏడు వరకు అనుమతి పొంది పదో తరగతి దాకా నిర్వహిస్తున్నారు. పది వరకు అనుమతి ఉన్న పాఠశాలల నుంచి ఫీజులు కట్టించి తమ పాఠశాల విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఫలితాలు మాత్రం తమ పాఠశాల పేరుతో ప్రకటించుకుంటున్నారు. మార్కుల ఆధారంగా ప్రచారం చేపడుతున్నారు. పేరెంట్స్‌ను బురిడీ కొట్టిస్తున్నారు. అయినా చర్యలు ఉండటం లేదు. ఉదాహరణకు ఖమ్మం రూరల్‌ మండలం ఏసీపీ ఆఫీసు సమీపంలోని సత్యనారాయణపురం (కొత్తూరు)లోని ఓ పాఠశాలను 2019-20 విద్యాసంవత్సరంలో ప్రారంభించారు. ఈ పాఠశాలకు నర్సరీ నుంచి ఏడు తరగతుల వరకు మాత్రమే అనుమతులున్నాయి. కానీ ఈ పాఠశాల ప్రారంభించినప్పటి నుంచీ పదో తరగతి వరకు తరగతులు బోధిస్తున్నారు. ఈ స్కూల్‌లో చదివిన పదో తరగతి విద్యార్థులను ఇదే మండలంలోని మరో స్కూల్‌ నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. ఫలితాలను మాత్రం తమ స్కూల్‌ పేరుతో ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఇదేతంతు కొనసాగుతున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు ఉండట్లేదు. ఈ విద్యాసంవత్సరం ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనుమతులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై టాస్క్‌ఫోర్స్‌ టీం ద్వారా తనిఖీలు చేయించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి
. అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అనుమతి ఉన్న పాఠశాలలను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పెట్టాలి. జిల్లావారీగా డిస్‌ప్లే చేయాలి. మీడియా ద్వారా ప్రచారం చేయాలి. ఇలా చేస్తే పేరెంట్స్‌ మోసపోరు. ఒకే అనుమతి ఉండి అనేక చోట్ల బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. ఒకే క్యాంపస్‌ అనుమతి తీసుకొని బోర్డులు పెట్టకుండా తరగతులు చేపడుతున్నారు. జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు ఫీల్డ్‌లో విచారణ చేయాలి. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలి. విద్యాశాఖ కార్యదర్శి నర్సింహారెడ్డిని బదిలీ చేశారు. ఇప్పుడు ఈ శాఖ బాధ్యతలు ఎవరు చూస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది.
కావాల్సిన అనుమతులు..
కొత్తగా ఒక పాఠశాలను ప్రారంభించాలంటే తనిఖీ ఫీజు, డిపాజిట్‌ తదితరాలకు బడి ప్రాంగణం విస్తీర్ణాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు ఫీజు చెల్లించాలి. అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ, ట్రాఫిక్‌ పోలీసుల క్లియరెన్స్‌, శానిటరీ సర్టిఫికెట్‌, పాఠశాల భవనం పటిష్టత ధ్రువీకరణపత్రాలు కలిగి ఉండాలి. ఒకసారి అనుమతి పొందితే పదేండ్ల వరకు గడువు ఉంటుంది. గుర్తింపు లేని బడులకు విద్యాహక్కు చట్టప్రకారం రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. అనుమతులకు భిన్నంగా తరగతులు నిర్వహిస్తున్న ఆయా పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు పెద్దగా లేవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -