1969లో తొలి ప్రయత్నంతో మొదలైన అంతర్జాలం ప్రయాణం, నేడు ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. అయితే, ఈ సాంకేతిక పురోగతి వెనుకనే సైబర్ నేరగాళ్ల దఅష్టి పడింది. అమాయక ప్రజల సంపాదనను ‘ఎర వేసి వలలో వేసే దాడులు’ (ఫిషింగ్) ద్వారా దోచుకుంటున్న ప్రమాదం నేడు అతిపెద్ద సామాజిక సమస్యగా మారింది. ఈ నేరాలను అడ్డుకోవడంలో ప్రభుత్వాల పాత్ర ఏమిటి.. ప్రజల గోప్యతకు రక్షణ మార్గమేంటి? అంతర్జాలం ఆవిర్భావానికి కారణం శీతల యుద్ధం సమయంలో అమెరికా రక్షణ వ్యవస్థ అవసరం. అక్టోబరు 29న తొలిసారిగా ఒక గణన యంత్రం (కంప్యూటర్) మరో యంత్రంతో సంభాషించింది. ఆనాటి చిన్న చర్య నేటి సాంకేతిక యుగానికి పునాది. పరిశోధకులకే పరిమితమైన ఈ అనుసంధాన వ్యవస్థ, ప్రపంచ వ్యాప్త అనుసంధాన వలయం రూపంలో ప్రజలందరికీ స్వేచ్ఛను ఇచ్చింది. నేడు మన వ్యాపారం, చదువు అంతా ఈ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంది.
ఈ అద్భుత వ్యవస్థలోనే మోసం చోటు చేసుకుంది. ఎర వేసి వలలో వేసే దాడులు (ఫిషింగ్) ఒక రకమైన సాంకేతిక దోపిడీ. నేరగాళ్లు బ్యాంకులు లేదా పెద్ద సంస్థల ప్రతినిధులుగా నటిస్తూ, నకిలీ ఈమెయిళ్లు, సందేశాలు పంపుతారు. భయం లేదా ఆశ చూపించి, ప్రజల నుంచి ఒకసారి వాడే సంఖ్యలు (ఓటీపీలు), సంకేత పదాలు (పాస్వర్డ్లు), ఖాతా వివరాలు లాగేస్తారు. ఈ విధంగా, కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం క్షణాల్లో సైబర్ నేరగాళ్ల చేతికి పోతోంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలు ఈ ప్రమాదం బారిన పడుతున్నారు.ప్రజల గౌరవం, గోప్యతను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రపంచవ్యాప్తంగా సాధారణ దత్తాంశ పరిరక్షణ నిబంధన (జీడీపీఆర్) వంటి కఠినమైన నియమాలు అమలులోకి వచ్చాయి. భారతదేశం కూడా 2023 ఆగస్టులో చారిత్రక డిజిటల్ వ్యక్తిగత దత్తాంశ పరిరక్షణ చట్టం (డీపీడీపీ చట్టం)ను ఆమోదించింది.
ఈ చట్టం ప్రజల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. అయితే, చట్టాలను రూపొందించడంతో పాటు, వాటిని కఠినంగా అమలు చేయడంలో నిబద్ధత కూడా ముఖ్యమే. ఈ విషయంలో జాప్యం జరిగితే నేరాలు పెరుగుతాయి. ఇంటర్నెట్తో ఎంతో ప్రయోజనం పొందుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంతర్జాల వలలో చిక్కి జీవితాలు సర్వనాశనం కూడా కావచ్చని పలువురి అనుభవాల్లో కూడా చూశాం. అంతర్జాల వలయంలో అధిక సమయం మునిగితే ఓపిక నశించడం, ఒంటరితనం, నిద్రలేమి, అనారోగ్య సమస్యలు, కంటి చూపుపై దుష్ప్రభావం, ఏకాగ్రత లోపించడం, దుర్వార్తలను ప్రేరేపించడం, అశ్లీల సైట్స్తో భవిష్యత్తు సర్వనాశనం, పనిలో శ్రద్ధ తగ్గడం, స్థూలకాయ సమస్యలు, సైబర్ నేరాలు లాంటివి కలుగుతున్నాయి. ప్రధాన దుర్వినియోగాల్లో సైబర్ బుల్లీయింగ్, ఫిషింగ్ స్కామ్, డాటా బ్రీచింగ్, అనధికారిక చొరబాట్లు, మాల్వేర్, ఆన్లైన్ గ్రూమింగ్, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, ఆన్లైన్ ప్రిడేటర్స్, సెక్సిటింగ్, రాన్సమ్వేర్, సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ మోసాలు, ఆన్లైన్ అప్పుల వేధింపులు, వ్యక్తిగత సమాచారాన్ని దోచేసి వేధించడం లాంటి పలు అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండటం అవసరం.
సైబర్ నేరాలను అడ్డుకోవాలంటే ప్రజల్లో తెలివైన ఆలోచన రావాలి. ఏ బ్యాంకు అధికారి కూడా ఫోన్లో ఒకసారి వాడే సంఖ్యలు (ఓటీపీలు) అడగరు అనే నిజం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నకిలీ అనుసంధాన మార్గాల (లింకుల) పట్ల అప్రమత్తంగా ఉండాలి. రెండు-దశల ధఅవీకరణ పద్ధతిని తప్పక వాడాలి. అన్యాయం జరిగితే, సహాయ కేంద్రాలకు (హెల్ప్లైన్లకు) లేదా పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలి. ఈ పోరాటంలో ప్రజలు చురుకైన పాత్ర పోషించినప్పుడే ఈ సాంకేతిక దాడికి అడ్డుకట్ట పడుతుంది.
ఫిరోజ్ ఖాన్
9640466464



