– కేసుల పరిష్కారానికి చర్యలు
– వాలంతరిలో ఆక్రమణలు తొలగించాలి
– సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశీలన : నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– కంచె ఏర్పాటుకు ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కబ్జాకు గురైన పక్షంలో ఎంత మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను యుద్ధ ప్రాతిపదికన స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆ భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణలో భాగంగా గురువారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్, ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్సీ అఫ్జల్ హుస్సేన్, ఈఎన్సీ అడ్మిన్ రమేష్ బాబు, వాలంతరి డైరెక్టర్ జనరల్ అనిత, హైడ్రా ఎస్పీ అశోక్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న గండిపేట సమీపంలోని హిమాయత్సాగర్, కిస్మత్పూర్తోపాటు వాలంతరి, టి.జి.ఇ.ఆర్.ఎల్కు చెందిన 426-30 ఎకరాలకు గాను 131-31ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించినట్టు చెప్పారు. అందులో ఐ.టి.ఐ.ఆర్ అధీనంలో ఉన్న 81.26 ఎకరాల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. మిగతా 50.13 ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు. కాగా ఈ ఆక్రమణలపై జిల్లా కోర్టులో 20 కేసులు పెండింగ్లో ఉండగా, హైకోర్టులో మరో రెండు కేసులు నడుస్తున్నాయని చెప్పారు. భూములను పరిరక్షించడంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డా ఎదుర్కొనేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక సీనియర్ న్యాయవాదిని నియమించనున్నట్టు ఆయన వెల్లడించారు. కోటానుకోట్ల విలువ చేసే భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గాను నీటిపారుదల శాఖా హైడ్రా, రెవిన్యూ, ఆర్అండ్ఆర్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖ భూములను సత్వరం గుర్తించాలని ఆయన నీటిపారుదల శాఖాధికారులకు సూచించారు. అంతేగాకుండా నీటిపారుదల క్వార్టర్లలో అక్రమంగా ఆక్రమించుకున్న వారిని తొలగించడంతోపాటు తక్షణమే వాటి సమగ్ర సమాచారం తన ముందుంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
నీటిపారుదల శాఖకు చెందిన అంగుళం భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భవిష్యత్లోనూ ఆక్రమణలకు చోటు లేకుండా పరిపాల నాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. తద్వారా ఆక్రమణలకు చెక్ పెట్టొచ్చని ఆయన సూచించారు. దానికి తోడు రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల కాలువల పక్కన ఉన్న భూముల్లో ,ప్రాజెక్టులకు చెందిన భూములలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదే విషయమై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నీటిపారుదల శాఖా భూములలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించామన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు విద్యుత్ను అందించ వచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
అన్యాక్రాంత భూములు స్వాధీనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES