నవతెలంగాణ – హైదరాబాద్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కె రాంప్ సినిమా విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో సీనియర్ నటుడు నరేశ్ నిర్మాతల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేశ్ మాట్లాడుతూ, “నేను రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. ఈ కాలంలో 200లకు పైగా నిర్మాతలను చూశాను. చాలా మంది నిర్మాతలు కళాకారులకు కేవలం పారితోషికం ఇస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ కష్టపడి పనిచేసే వారికి డబ్బుతో పాటు గౌరవం కూడా ఇవ్వాలి” అని అన్నారు.
అదే సమయంలో ఈ సినిమా నిర్మాత రాజేశ్ను ప్రశంసిస్తూ, “ఆయన ఆర్టిస్టులను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం” అని తెలిపారు. కిరణ్ అబ్బవరం సినిమా హిట్ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నరేశ్.. “యంగ్ టీం ఎప్పుడూ కష్టపడి పనిచేస్తుంది. ఈ సినిమా విజయం దానికి నిదర్శనం” అని పేర్కొన్నారు. కాగా, నిర్మాతలపై నరేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.