నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా వెంగళరావు నగర్లో రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు.. ఎత్తుపల్లాలు ఉంటాయి.. అవకాశాలు అందరికీ అన్నిసార్లు రాకపోవచ్చు.. అవకాశం వస్తే మాత్రం తప్పకుండా కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోవాలని సూచించారు. మన కోసం కష్టపడే వ్యక్తిని గెలిపించుకోకపోతే చారిత్రక తప్పిదమే అవుతుందని అన్నారు. సెంటిమెంట్ పేరుతో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ప్రజల ముందుకు వస్తోంది.. గతంలో కంటోన్మెంట్లో కూడా ఇలాగే వచ్చారు కానీ ప్రజలు నమ్మలేదు.. బీఆర్ఎస్ను నమ్మడం ప్రజలు ఎప్పుడో మానేశారని ఎద్దేవా చేశారు.
పీజేఆర్ మరణిస్తే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ దుర్మార్గంగా అభ్యర్థిని నిలబెట్టిందని మండిపడ్డారు. నగరానికి గోదావరి నీళ్లు తెచ్చిన గొప్ప వ్యక్తి పీజేఆర్ అని కొనియాడారు. సానుభూతి ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్కు లేనే లేదని అన్నారు. బీఆర్ఎస్ కోసం బీజేపీ డమ్మీ అభ్యర్థిని పోటీలో పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీది ఫెవీకాల్ బంధమని మరోసారి రుజువైందన్నారు. కావాలనే కుట్రపూరితంగా హైదరాబాద్ అభివృద్ధిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్వం అవయవదానం చేసి మరీ బీజేపీని గెలిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ కోసం బీజేపీ నేతలు కష్టపడుతున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కేంద్రమంత్రులుగా ఉన్నా రాష్ట్రానికి వాళ్లు చేసింది శూన్యం అన్నారు. అంతేకాదు.. వాళ్లిద్దరు జూబ్లీహిల్స్కు వచ్చిన దాఖలాలు కూడా లేవని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ నేతలు మీ ఇండ్ల ముందుకు వస్తే వాతలు పెట్టండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు.

 
                                    