బీసీసీఐకి టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురం లేఖ
హైదరాబాద్ : 2005 నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. గత 90 ఏండ్లుగా తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు తీరని అన్యాయం జరుగుతోందని, గ్రామీణ క్రికెటర్లకు అవకాశాలు కల్పించేందుకు జిల్లాలకు 300 క్రికెట్ క్లబ్లకు సభ్యత్వం ఇచ్చేలా హెచ్సీఏను ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియాకు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఓ లేఖను ఈమెయిల్ చేశారు. ‘2005 నుంచి హెచ్సీఏలో జరుగిన అవినీతి, అక్రమాలపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలి. తెలంగాణలో 31 గ్రామీణ జిల్లాలకు కలిపి 300 క్లబ్లకు సభ్యత్వం ఇచ్చేలా హెచ్సీఏను ఆదేశించాలి. బీసీసీఐ అందించే నిధుల్లో 50 శాతం గ్రామీణ క్రికెట్ అభివద్దికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. బీసీసీఐ దేశవాళీ టోర్నమెంట్లలో గ్రామీణ క్రికెటర్లు పోటీపడేలా టీడీసీఏకు సహకారం అందించాలి. అవినీతి, అక్రమాలకు పాల్పడిన హెచ్సీఏ ఆఫీస్బేరర్లపై జీవితకాల నిషేధం విధించేలా కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని’ బీసీసీఐ కార్యదర్శిని అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి లేఖలో కోరారు.