Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంఐడీటీఆర్‌ను ఏర్పాటు చేయండి

ఐడీటీఆర్‌ను ఏర్పాటు చేయండి

- Advertisement -

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి మంత్రి పొన్నం విజ్ఞప్తి
భారత్‌ మండపంలో 43వ రవాణా అభివృద్ధి మండలి మీటింగ్‌
తెలంగాణ రవాణా శాఖ సంస్కరణలను వివరించిన పొన్నం
త్వరలో వాహన్‌ అప్లికేషన్‌ తీసుకురానున్నట్టు వెల్లడి
పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటన


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో రెండు డ్రైవింగ్‌, ట్రైనింగ్‌, పరిశోధన కేంద్రం (ఐడీటీఆర్‌), డిస్ట్రిక్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి గడ్కరీని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. తెలంగాణ రైజింగ్‌ ‘విజన్‌ 2047’లో భాగంగా రవాణాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఆ సమయానికి ఐదు లక్షల మంది హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ స్కిల్స్‌ ఉన్న డ్రైవర్లను తయారు చేయడానికి ఈ ఐడీటీఆర్‌ ట్రైనింగ్‌ రీసెర్చ్‌ ఉపయోగపడాలని చెప్పారు. అలాగే భవిష్యత్తులో తెలంగాణలో ప్రపంచస్థాయి ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీ ఏర్పాటు చేయడంతో పాటు సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌ లెన్స్‌ డ్రైవింగ్‌ రోడ్‌ సేఫ్టీ ఉండేలా కార్యచరణ తీసుకున్నట్టు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ట్రక్‌ టర్మినల్‌, పార్కింగ్‌ యార్డుల అభివృద్ధి, హైదరాబాద్‌ నగరంలో ప్రయివేటు బస్టాండ్ల నిర్మాణం, పాస్‌పోర్ట్‌ ఆఫీసుల తరహాలో ఆర్టీఓ కార్యాలయాలను ఆధునీకీకరణ చేస్తామన్నారు.

గురువారంనాడిక్కడ భారత్‌ మండపంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రుల రవాణా అభివృద్ధి మండలి 43వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, రవాణా శాఖ కమిషనర్‌ ఇలాంబర్తి, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, రవాణా శాఖలో తీసుకురానున్న విధానాలను వివరించారు. డ్రైవింగ్‌ లైసెన్సుకు సంబంధించిన ‘సారథి’ అమలు చేస్తోన్నామనీ, వాహనాల రిజిస్ట్రేషన్‌ కి సంబంధించి వాహన్‌ (ఎన్‌ఐసీ) అప్లికేషన్‌ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ సారథి, వాహన్‌ వల్ల దేశమంతా ఏకరీతి వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్ళినప్పుడు వారికి సులభతరంగా మైగ్రేట్‌ కావడానికి అవకాశం కలుగుతుందన్నారు. అలాగే ఆర్టీఏ ఆఫీస్‌కి రాకుండానే వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే రవాణా సేవలను పొందవచ్చని చెప్పారు.

ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రత్యేక కార్యాచరణ
హైదరాబాద్‌ నగరంలో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) పరిధిలో దశలవారీగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకుందని మంత్రి వివరించారు. 2024, నవంబర్‌లో తెచ్చిన ఈవీ పాలసీతో 2025లో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య 2,58,325 (1.42 శాతం) పెరిగిందన్నారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఈ సంఖ్యను 100 శాతానికి పెంచడం, ఓఆర్‌ఆర్‌ బయట 25 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలో కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ) మాత్రమే నడిచే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు.

తొలుత పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సులు… తరువాత ఈవీ టాక్సీలు, ఆటో రిక్షలు, ఇతర కమర్షియల్‌ వాహనాలకు వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో భారీగా ఎలక్ట్రిక్‌, ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు అనుమతి ఇవ్వడంతో పాటు డీజిల్‌ ఆటోల స్థానంలో రేటిరోఫిట్‌కి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు అలాగే.. రాష్ట్రంలో 2024లో కొత్త స్క్రాప్‌ పాలసీని ప్రకటించామని చెప్పారు. పాత వాహనాలను స్క్రాప్‌ చేస్తే.. ట్యాక్స్‌ తగ్గింపు, పెనాల్టీ రద్దు వంటి ప్రోత్సాహకాలను ప్రకటించామని తెలిపారు. వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీలను మరింత కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా 37 ఆటోమేటెట్‌ టెస్టింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -