నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని పుణెలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. డెలివరీ ఏజెంట్ ముసుగులో ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు, ఒంటరిగా ఉన్న 22 ఏళ్ల ఐటీ ఉద్యోగినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వెళ్తూ వెళ్తూ, బాధితురాలి ఫోన్కు ‘నేను మళ్లీ వస్తా’ అని సందేశం పంపి బెదిరించడం నగరంలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుణెలోని కొంధవా ప్రాంతంలో నివసిస్తున్న యువతి బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన ఫ్లాట్లో ఒంటరిగా ఉంది. ఆమె సోదరుడు బయటకు వెళ్లిన సమయం చూసి, నిందితుడు డెలివరీ ఏజెంట్లా అక్కడికి వచ్చాడు. ఓ బ్యాంకు పత్రం చూపిస్తూ సంతకం చేయాలని కోరాడు. బాధితురాలు పెన్ను కోసం లోపలికి వెళ్లగా, ఆమె వెనుకే ఫ్లాట్లోకి చొరబడిన నిందితుడు వెంటనే తలుపు గడియపెట్టి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఈ దారుణం తర్వాత స్పృహ కోల్పోయిన బాధితురాలి ఫోన్తో నిందితుడు పాక్షికంగా కనిపించేలా ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఆమె ఫొటోలు తీసి, ఈ విషయం పోలీసులకు చెబితే వాటిని వైరల్ చేస్తానని హెచ్చరించాడు. దాదాపు గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి వచ్చి, వెంటనే బంధువులకు సమాచారం అందించింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఘటనా స్థలాన్ని గురువారం పరిశీలించిన పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్, నిందితుడిని పట్టుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫోన్లో లభించిన సెల్ఫీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.