– కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆగ్రహం
న్యూఢిల్లీ : గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి వేతనాలు, సామగ్రి బిల్లుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికులకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సూచించింది. సామగ్రి కొనుగోలుకు సంబంధించి తాను అడిగిన ప్రశ్నకు మంత్రిత్వ శాఖ సమాధానం దాటవేయడంపై మండిపడింది. ఇంతటి ముఖ్యమైన విషయాన్ని విస్మరించడమేమిటని నిలదీసింది. ఈ మేరకు కాంగ్రెస్ సభ్యుడు సప్తగిరి ఉలాకా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది.
2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెటరీ కేటాయింపులపై కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం…కార్మికులకు రూ.12,219.18 కోట్ల వేతనాలు పెండింగులో ఉన్నాయి. సామగ్రి కొనుగోలుకు సంబంధించి రూ.11,227.09 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత బడ్జెట్లో బకాయిలు 27.26 శాతంగా ఉన్నాయి. అంటే కేటాయించిన నిధులలో నాలుగో వంతు నిధులను గత సంవత్సరపు బకాయిల చెల్లింపులకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు వాస్తవ బడ్జెట్ రూ.62,553.73 కోట్లు. బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా డిమాండ్కు అనుగుణంగా పథకాన్ని అమలు చేయడం కష్టమవుతుందని కమిటీ తెలిపింది. వేతనాలు, సామగ్రి కింద కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని పటిష్టవంతం చేసుకోవాలని, బకాయిల చెల్లింపులో ఇకపై ఎలాంటి జాప్యం జరగకుండా సమర్ధవంతమైన చర్యలు చేపట్టాలని కమిటీ తన నివేదికలో సూచించింది.
‘ఉపాధి’ కి నిధులు విడుదల చేయరా?
- Advertisement -
- Advertisement -