Sunday, July 6, 2025
E-PAPER
Homeఆటలుశుభ్‌మన్‌ రికార్డు సెంచరీ

శుభ్‌మన్‌ రికార్డు సెంచరీ

- Advertisement -

– ఇండియా రెండో ఇన్నింగ్స్‌ 427/6 డిక్లేర్డ్‌
– ఇంగ్లండ్‌ లక్ష్యం 608 పరుగులు
బర్మింగ్‌హామ్‌ :
టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ పలు రికార్డులను సమం చేస్తున్నాడు. తొలి టెస్ట్‌లో సెంచరీ, రెండో టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలతో ఈ ఫీట్‌లు అందుకున్నాడు. ఎడ్‌బాస్టన్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన మూడో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఈ ఫీట్‌ సాధించిన రెండో భారత సారథిగా శుభ్‌మన్‌ పలు రికార్డులు సమం చేశాడు. బర్మింగ్‌ హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నాల్గోరోజు ఆటలో భాగంగా శుభ్‌మన్‌(161; 162బంతుల్లో 13ఫోర్లు, 8సిక్సర్లు) మెరిసాడు. మరోవైపు కెఎల్‌ రాహుల్‌, పంత్‌, జడేజా అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో భారతజట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6వికెట్ల నష్టానికి 427పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతతో కలిసి ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు ముంగు 608పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
ఓవర్‌నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 64 పరుగులతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారతజట్టును కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ భారీ శతకంతో ఆదుకున్నారు. తొలి సెషన్‌లో కరణ్‌ నాయర్‌(26) నిరాశపరిచినా.. కెఎల్‌ రాహుల్‌-గిల్‌ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. లంచ్‌ తర్వాత రిషభ్‌ పంత్‌(61)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన గిల్‌.. అనంతరం రవీంద్ర జడేజా(69నాటౌట్‌)తో 177 పరుగులు జోడించాడు. టీ సెషన్‌కు భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. టీ సెషన్‌ తర్వాత శుభ్‌మన్‌, జడేజా ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలో కెప్టెన్‌ డబుల్‌ సెంచరీవైపు దూసుకెళ్తున్న దశలో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ బషీర్‌కు రివర్స్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆంధ్ర కుర్రాడు నితీశ్‌ రెడ్డి(1) మరోసారి నిరాశపరిచాడు. సుందర్‌(12నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్న దశలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేస్తున్నట్లు గిల్‌ ప్రకటించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు బషీర్‌, టంగ్‌కు రెండేసి, కర్సే, రూట్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
రికార్డుపుటల్లో శుభ్‌మన్‌
టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఒక టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీ కొట్టిన తొమ్మిదో కెప్టెన్‌గా శుభ్‌మన్‌ రికార్డుపుటల్లోకెక్కాడు. ఈ క్రమంలోనే భారత్‌నుంచి గవాస్కర్‌ తర్వాత ఈ ఫీట్‌ అందుకున్న రెండో బ్యాటర్‌ శుభ్‌మన్‌ నిలిచాడు. ఇక విరాట్‌ కోహ్లీ తర్వాత కెప్టెన్‌గా భారత్‌ తరఫున రెండు టెస్టుల్లో మూడు సెంచరీలు కొట్టిన రెండో బ్యాటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ నిలిచాడు. క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్లుగా విజరు హజారే, జాకీ మెక్‌గ్లూ, గ్రెగ్‌ చాపెల్‌, సునీల్‌ గవాస్కర్‌, అలస్టైర్‌ కుక్‌, స్టీవెన్‌ స్మిత్‌ మరియు ధనంజయ డి-సిల్వా వరుసగా రెండు సెంచరీలు సాధించారు.
స్కోర్‌బోర్డు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 587
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 407
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (ఎల్‌బి)టంగ్‌ 28, కెఎల్‌ రాహుల్‌ (సి)టంగ్‌ 55, కరణ్‌ నాయర్‌ (సి)స్మిత్‌ (బి)కర్సే 26, శుభ్‌మన్‌ (సి అండ్‌ బి)బషీర్‌ 161, పంత్‌ (సి)డకెట్‌ (బి)బషీర్‌ 65, జడేజా (నాటౌట్‌) 69, నితీశ్‌కుమార్‌ రెడ్డి (సి)క్రాలే (బి)రూట్‌ 1, సుందర్‌ (నాటౌట్‌) 12, అదనం 10. (83ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 427పరుగులు
వికెట్ల పతనం: 1/51, 2/96, 3/126, 4/236, 5/411, 6/412
బౌలింగ్‌: వోక్స్‌ 14-3-61-0, కర్సే 12-2-56-1, టంగ్‌ 15-2-93-2, స్టోక్స్‌ 7-1-26-0, బషీర్‌ 26-1-119-2, రూట్‌ 9-1-65-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -