నిరంతర అభ్యాసమే విజయానికి మార్గం
అత్యున్నత ప్రమాణాల కోసం యూనివర్సిటీ కృషి చేయాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
అట్టహాసంగా శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ వేడుకలు
161 గోల్డ్ మెడల్స్, 25 పీహెచ్డీ పట్టాల ప్రదానం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘విద్యార్థులు కేవలం అకాడమిక్ విజయాలకే పరిమితం కాకుండా, క్రమశిక్షణను దిక్సూచిగా, జిజ్ఞాసను ఇంధనంగా మలచుకోవాలి. నైపుణ్యం అనే కొత్త బలాన్ని పెంపొందించు కుంటూ విజయానికి ఆత్మలా ఉండే నిరంతర అభ్యాసాన్ని మరవద్దు’ అని యూనివర్సిటీ ఛాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన రెండో స్నాతకోత్సవ వేదికపై ఆయన స్ఫూర్తి దాయక ప్రసంగం చేశారు. యూనివర్సిటీల ఎన్ఏఏసీ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ల ఆవశ్యకత గురించి వివరించారు. యూనివర్సిటీ ఉన్నత ప్రమాణాలు సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
తెలంగాణలోని మధ్య, గ్రామీణ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో శాతవాహన యూనివ ర్సిటీ ఒకటని, సమానత్వ ఆవిష్కరణలను మేళవించి విద్యార్థులు విజయ సోపానాలు సాధించడానికి ఈ వర్సిటీ ఎంతగానో కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే, విద్యార్థులు కనే కలలకు బలం చేకూర్చేందుకు, వాటి సాధనకు అవసరమైన మౌలిక వసతులు మెరుగు పడాలని ఉద్ఘాటించారు. ఎన్ఏఏసీ (న్యాక్) గుర్తింపు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం కృషి చేయాలని యూనివర్సి టీని కోరారు. డిజిటల్ అభ్యాసం భౌగోళిక, ఆర్థిక పరమైన అడ్డంకులను తొలగించిందన్నారు. ప్రతి డిగ్రీ ఒక ప్రారంభం మాత్రమేనని, ప్రతి వైఫల్యం వినయం అనే దుస్తులు ధరించిన గురువు లాంటిదని చెప్పారు. విద్యార్థులు ప్రయో గా ్మక విద్య ద్వారా మేధస్సునే కాక, నిజాయితీని కూడా పెంపొందించుకోవాలని గవర్నర్ సూచించారు.
సమాజ పరివర్తనకు విశ్వవిద్యాలయాలు కీలకం
ఉన్నత విద్య ద్వారా గ్రామీణ, వెనుకబడిన యువత సాధికారతకు కృషి చేయడంలో శాతవాహన విశ్వ విద్యాల యం ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలుస్తోం దని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ బిజె.రావు ప్రశంసించారు. గ్రాడ్యుయేట్లు అయిన వారిలో చాలా మంది మొదటి తరం అభ్యాసకులే ఉన్నారు. వీరు అనేక సవాళ్లను అధిగమించి ఈ మైలురాయిని చేరుకున్నారని, వారి విజయానికి యూనివర్సిటీ అందించిన అండదండలు, అధ్యాపకుల మార్గదర్శకత్వం, సమ్మిళిత వాతావరణమే కారణం అని చెప్పారు. ఎంఫార్మసీ, ఎల్ఎల్బీ, బీటెక్ వంటి కొత్త కోర్సులను ప్రారంభించడం ద్వారా శాతవాహన యూనివర్సిటీ తన విద్యాపరిధులను విస్తరిస్తున్న తీరు, మారుతున్న పారిశ్రామిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో వ్యవహరి స్తోందని అభినందించారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్కుమార్ ప్రసంగిం చారు. అంతకు ముందు వర్సిటీ పరిధిలో ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 161మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 25మంది పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ సహా ఉన్నతాధికారులు కలెక్టరేట్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారుల తో సమావేశమయ్యారు.
హెచ్సీయూ వీసీ ప్రొఫెసర్ బిజె.రావు



