– రైతునేత జగ్జిత్సింగ్ దల్లెవాల్ సైతం
– నేటి ఆందోళనల నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి రైతు నాయకులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పంజాబ్లో అనేక మంది సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులను సోమవారం అక్కడి పోలీసులు ‘గృహ నిర్బంధం’లో ఉంచారని రైతు నాయకులు విమర్శించారు. శంభు పోలీస్స్టేషన్ వెలుపల ఈనెల 6న జరిగే తమ ఆందోళనకు ముందే ఎస్కేఎం నేత జగ్జిత్సింగ్ దల్లెవాల్ సహా అనేక మంది నాయకులను అదుపులోకి తీసుకున్నట్టు వారు పేర్కొన్నారు. గతంలో శంభు, ఖనౌరి ప్రాంతాల్లో రైతుల ఆందోళన జరగకుండా అణచివేత పద్ధతులను ఉపయోగించారని ఆరోపిస్తూ పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 6 (మంగళవారం)న ఎస్కేఎం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పంజాబ్ పోలీసులు సోమవారం తెల్లవారుజామునే ఎస్కేఎం నేతల ఇండ్లకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారని రైతు నాయకులు పేర్కొన్నారు. మంగళవారం జరిగే ఆందోళనకు ప్రజలను సమీకరించకుండా పోలీసులు వారిని నిరోధించాలను కుంటున్నారని విమర్శించారు. ”ఫరీద్కోట్ జిల్లాలోని తన ఇంట్లో తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో దల్లెవాల్ను గృహనిర్బంధంలో ఉంచారు” అని ఓ రైతు నాయకుడు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అనేక మంది రైతు నాయకులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో మంజిత్ సింగ్ రారు, దవీందర్ సింగ్ లాంటి రైతు నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా దల్లెవాల్ సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేశారు. ”నేను ఇప్పటికీ బలహీనంగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను నడవలేను. అయినప్పటికీ పోలీసులు నన్ను నా ఇంటికి పరిమితం చేశారు” అని దల్లెవాల్ అన్నారు. రైతులు శంభు పోలీస్ స్టేషన్ వెలుపల ఒక రోజు శాంతియుత నిరసనను ప్రకటించారని, కానీ ప్రభుత్వం ”భయపడి” వారిని అనుమతించడం లేదని దుయ్యబట్టారు. గతంలో జరిగిన ఆందోళనలో చాలా మంది రైతు నాయకులు, రైతులకు నష్టం వాటిల్లిందని, వారి ట్రాలీలు, ఇతర వస్తువులు శంభు, ఖనౌరి సరిహద్దు పాయింట్ల వద్ద దొంగిలించ బడ్డాయని అన్నారు. కోల్పోయిన వస్తువులను రైతులు తిరిగి పొందలేదని తెలిపారు. చోరీకి గురైన రైతుల వస్తువులకు పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర పోలీసులు హామీ ఇచ్చినా అమలు చేయలేదని దల్లెవాల్ విమర్శించారు. ”నిందితులపై సత్వర చర్యలు తీసుకునే బదులు, చోరీకి గురైన రైతుల వస్తువులను గుర్తించడంలో సహాయం చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మే 6న మేము నిరసనకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం భయపడి మమ్మల్ని అక్కడకు రాకుండాఅడ్డుకోవాలని నిర్ణయించింది” అని ఆయన అన్నారు.
గృహనిర్బంధంలో ఎస్కేఎం నేతలు
- Advertisement -
- Advertisement -