కేసు నమోదు చేసిన సీఐ శ్రీను
నవతెలంగాణ – చిన్నకోడూరు
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రిని పట్టించుకోకుండా వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై శనివారం కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను తెలిపారు. మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి (94) కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపేటలో వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గంగాపూర్లోనే వ్యవసాయం చేస్తున్నాడు.
నారాయణరెడ్డి తనకున్న 7 ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు సమానంగా (చెరి 3 ½ ఎకరాలు) రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వయస్సు పైబడటంతో తమను చూసుకుంటారని ఆస్తిని అప్పగించగా, కొడుకులు మాట మార్చారు. తమను ఒక పాత ఇంట్లో ఉంచి, కనీస సౌకర్యాలు కల్పించకుండా, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే బూతు మాటలతో తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ మానవత్వంతో స్పందించారు. బాధితుడు పోలీస్ స్టేషన్కు రాలేని స్థితిలో ఉన్నందున, అధికారులే నేరుగా నారాయణరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఫిర్యాదును స్వీకరించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను వేధించడం చట్టరీత్యా నేరమని, బాధ్యులైన ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేయడం జరిగిందని , చట్టరీత్య తగిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీను తెలిపారు.



