Thursday, July 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఉచితాల కోసం ప్రత్యేక డిస్కం

ఉచితాల కోసం ప్రత్యేక డిస్కం

- Advertisement -

– ప్రభుత్వ సబ్సిడీలన్నీ దానికే బదలాయింపు
– ఇప్పుడున్న రెండు డిస్కంల రేటింగ్స్‌ పెంచాలి

– విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయాలి
– సోలార్‌ విద్యుత్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి : ఇంథనశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణల్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. దానిలో భాగంగా రాష్ట్రంలో మరో కొత్త డిస్కం (విద్యుత్‌ పంపిణీ సంస్థ)ను ఏర్పాటు చేయాలని చెప్పారు. వ్యవసాయ ఉచిత విద్యుత్‌, గృహజ్యోతిలో భాగంగా అందించే 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్‌, స్కూళ్ళు, కాలేజీలు సహా ఇతర ఉచిత విద్యుత్‌ పథకాలన్నీకొత్త డిస్కమ్‌ పరిధిలోకే తీసుకురావాలని సూచించారు. దానికోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఇంథనశాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఇంథన, ఆర్థిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, సీఎమ్‌ స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌రెడ్డి, టీజీజెన్‌కో సీఎమ్‌డీ హరీశ్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫారూఖీ, టీజీఎన్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎమ్‌డీ ఎన్‌ బలరాం, టీజీరెడ్కో వీసీఎమ్‌డీ వీ అనీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్‌ పరిధిని నిర్ణయించాలని సూచించారు. దీనివల్ల ఇప్పుడున్న రెండు డిస్కంల పనితీరు మెరుగుపడుతుందనీ, జాతీయ స్థాయిలో రేటింగ్స్‌ పెరుగుతాయని చెప్పారు. ఇప్పుడున్న టీజీఎన్పీడీసీఎల్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సంస్థలు పూర్తిగా వాణిజ్య విద్యుత్‌ కార్యకలాపాలు చేపడుతాయనీ, కొత్త డిస్కమ్‌ ప్రభుత్వ సబ్సిడీతో నడుస్తూ, విద్యుత్‌ నిర్వహణ చేపడుతుందని తెలిపారు. దీనిపై వెంటనే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. డిస్కమ్‌ల ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు అమలు చేయక తప్పదని స్పష్టంచేశారు. డిస్కమ్‌ల పునర్వస్థీకరణతో పాటు విద్యుత్‌ సంస్థలపై ఇప్పుడున్న రుణభారం తగ్గించుకోవాలని అన్నారు. దానికోసం ప్రస్తుతం పదిశాతం ఉన్న వడ్డీ భారాలను 6 శాతానికి తగ్గించుకొనేలా రుణాల రీ షెడ్యూలింగ్‌ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్ల్లో సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్‌ప్లాం ట్లు ఏర్పాటు చేయాలనీ, జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని సూచించారు. ఈ పనుల్ని యుద్ధప్రాతిపదికగా చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయానికి సౌర విద్యుత్‌ అందించాలనీ, దానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని చెప్పారు. దీనికోసం ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. సచివాలయంలో వాహనాల పార్కింగ్‌ కోసం సోలార్‌ రూఫ్‌ టాప్‌ షెడ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందిర సోలార్‌ గిరి జల వికాసం పథకాన్ని రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆదేశించారు. మూడేండ్లలో 2 లక్షల 10వేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలనీ, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్‌ పంపుసెట్లను అందించే లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు.

జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశం
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ల ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో వాణిజ్య పన్నుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ పరిధిలోని సంస్థలు సక్రమంగా పన్ను చెల్లించేలా చూడాలని సూచించారు. అదే సమయంలో చెల్లింపుదారులకు సంబంధించి అనుమానాలు, సందేహాల నివృత్తికి కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సెంటర్‌
జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలి నిర్వహణలో ఏఐను వినియోగించుకోవాలని తెలిపారు. జీఎస్టీ, ఇతర పన్నుల విషయంలో పొరుగు రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి మేలైన విధానాలను స్వీకరించాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించేలా కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్‌ హరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -