రేపు ఫుట్బాల్ క్లబ్తో సమావేశం
న్యూఢిల్లీ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) అనిశ్చితిలో పడగా.. పలు ఐఎస్ఎల్ ప్రాంఛైజీలు ఫస్ట్ టీమ్ ఆపరేషన్స్ను నిరవధికంగా నిలిపివేశాయి. ఫలితంగా ఆటగాళ్లు, సిబ్బంది వేతనాలు అందుకోవటం లేదు. ఇండియన్ సూపర్ లీగ్ పున ప్రారంభం అవుతుందా? లేదా అనే అంశంపై ఎవరికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచనలతో కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఉన్నతాధికారులు బుధవారం న్యూఢిల్లీలోని సాయ్ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరు సెషన్ల అంతర్గత భేటీలు షెడ్యూల్ చేశారు. తొలుత క్రీడాశాఖ, సాయ్ ఉన్నతాధికారులు ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్తో భేటీ అవుతారు.
ఆ తర్వాత ఐ లీగ్, దిగువ డివిజన్ క్లబ్స్తో భేటీ ఉంటుంది. 15 ఏండ్లు ఐఎస్ఎల్ను నిర్వహించిన ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డిఎల్)తో సమావేశం అనంతరం.. కమర్షియల్ భాగస్వాములు, ప్రసారదారులు-ఓటీటీ వేదికల ప్రతినిధులతో మాట్లాడుతారు. అంతిమంగా అందరితో కలిపి సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. సోమవారం న్యూఢిల్లీలోని ఫుట్బాల్ హౌస్లో భేటీ అయిన ఐఎస్ఎల్ క్లబ్లు.. 2025-26 సీజన్కు ప్రసారదారుగా దూరదర్శన్ను ఎంచుకునేందుకు చర్చించినట్టు సమాచారం. సాయ్ అధికారులతో సమావేశానికి దూరదర్శన్ అధికారులు సైతం హాజరయ్యే అవకాశం ఉంది.



