నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈ పెను విషాదం చోటు చేసుకుంది. 18 ఏండ్లల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ.. ఐపీఎల్లో తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అంతకు ముందు ఆర్సీబీ టీమ్ ట్రోఫీతో తొలిసారి బెంగళూరుకు రాగా.. ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విమానాశ్రయానికి వెళ్లి ఆర్సీబీ జట్టుకు స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, టిమ్ డేవిడ్, దినేశ్ కార్తిక్లకు ఆయన పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.