Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలువిద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి

విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి

- Advertisement -

– సిరిసిల్ల జేఎన్టీయూలో శాశ్వత భవనాలు నిర్మించాలి
– సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, వీసీతో ఫోన్‌లో సంప్రదించిన కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జేఎన్టీయూ సిరిసిల్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, జేఎన్టీయూ వీసీ టి కిషన్‌కుమార్‌రెడ్డితో ఆయన ఫోన్‌లో సంప్రదించారు. జేఎన్టీయూ సిరిసిల్లలో ఇంజినీరింగ్‌ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతులకు ఆటంకం కలగకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

తమ హయాంలో ప్రారంభించిన జేఎన్టీయూ సిరిసిల్ల ఇంజినీరింగ్‌ కాలేజీకి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేములవాడలోని డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న ప్రస్తుత తాత్కాలిక తరగతి గదులకు తాళం వేయడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన వార్తను ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం నడుస్తున్న తీరుగానే స్థానిక అగ్రహారంలోని డిగ్రీ కాలేజీ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే కాలేజీతో అవసరమైన ఒప్పందం చేసుకుని పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలను చెల్లించేలా చూడాలని కోరారు. ఈ అంశంలో సానుకూలంగా స్పందించిన సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ వెంటనే పెండింగ్‌ బకాయిలను చెల్లించడంతోపాటు తరగతులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారని వివరించారు.

ప్రభుత్వం 2021లో సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీని మంజూరు చేసిందని తెలిపారు. దీని కోసం రూ.402 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. మొదటి విద్యా సంవత్సరంలో 360 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 1032 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వివరించారు. వారిలో 700 మందికి హాస్టల్‌ వసతి కూడా కల్పించారని తెలిపారు. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు డిగ్రీ కాలేజీలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, కాలేజీ కమిషనర్‌ నుంచి తాత్కాలిక వసతి పొడిగింపు ఉత్తర్వులు రానందున, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ తరగతి గదులకు తాళం వేశారని తెలిపారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంశాన్ని తెలుసుకున్న కేటీఆర్‌, సంబంధిత అధికారులతో మాట్లాడారు.

జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో టీచింగ్‌, వసతికి సంబంధించిన ఈ సమస్యను పరిష్కరించడానికి జేఎన్టీయూ అధికారులు జులైలోనే సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. ఈ అంశంలో తగిన అనుమతులు ఆదేశాలు స్థానిక డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఇవ్వాలని కేటీఆర్‌ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 2023లోనే మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలం కేటాయించినందున, అక్కడ త్వరగా శాశ్వత భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులు తక్షణమే దృష్టిసారించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad